CM Jagan : ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికలలో ప్రజలను ఆకట్టుకునేందుకు సంక్షేమ పథకాల లిస్టును రెడీ చేస్తున్నారు. ఇక వైసీపీ అధినేత, సీఎం జగన్ కూడా మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం మెజార్టీ సంక్షేమ పథకాలను మహిళలకు అమలు చేస్తున్నారు. ఆ లిస్టులోనే మరో పథకం అమలు చేయాలని ఆయన భావిస్తున్నారని సమాచారం. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అందించేందుకు అధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. వీలైతే ఈ పథకం జనవరి 1నే ప్రారంభం కావొచ్చని కూడా అంటున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కర్నాటక, తెలంగాణలో సూపర్ సక్సెస్ అయ్యింది. కొన్ని సమస్యలు ఉన్నా అవి సర్దుకుంటున్నాయి. ఈ పథకం అమలుతో అక్కడి మహిళలు హర్షం వ్యక్తం చేస్తుండడంతో… ఆ సౌకర్యాన్ని ఏపీ మహిళలకు కూడా అందించాలని జగన్ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో మహిళల ఓట్లను గంపగుత్తగా రాబట్టుకోవచ్చని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఈ పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అంటున్నారు.
పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానం ప్రకారం.. ప్రతీ నెలా ఆర్టీసీపై 200 కోట్ల వరకూ భారం పడుతోందని అంచనా వేస్తున్నారు. ఏడాదికి దాదాపు మూడు వేల కోట్ల వరకూ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. మిగతా పథకాల కన్నా ఈ పథకం తక్కువ కోట్ల ఖర్చుతో మహిళలందరికీ లబ్ధి చేకూర్చే అవకాశం ఉండడంతో వారి ఆదరణను సంపూర్తిగా పొందవచ్చని జగన్ భావిస్తున్నారు. అధికారులు ఇచ్చిన నివేదిక తర్వాత జగన్ ఉచిత ప్రయాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీపై పడే భారం.. ఆటో డ్రైవర్లకు జరిగే నష్టం, పురుష ప్రయాణికుల ఇక్కట్లు..తదితర అంశాలపై అధికారులు సుదీర్ఘంగా అంచనా వేస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున 40లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 15లక్షల మంది వరకు మహిళలు ఉంటారని అంచనా. అలాగే అన్ని రకాల పాస్ ఉన్నవారు 10లక్షల మంది ఉన్నారు. వీరిలో 3-4లక్షల వరకూ విద్యార్థినులు, మహిళలు ఉంటారు. ప్రస్తుతం ఆర్టీసీకి సగటున రూ.17 కోట్ల ఆదాయం వస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే రూ.6కోట్ల వరకూ ఆదాయం తగ్గే అవకాశం ఉంది.
మహిళలకు ఉచిత ప్రయాణం అమలు ప్రభుత్వ ఖజానాపై మిగతా పథకాల వలే పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేకపోవడంతో ఈ పథకాన్ని అమలుచేయడానికి సీఎం ముందుకెళ్లే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. అలాగే లగ్జరీ బస్సుల్లోనూ రాయితీ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. అయితే జనవరి 1 నుంచి పథకం అమలుపై ఆర్టీసీ ఇంకా ధ్రువీకరించలేదు. జగన్ నిర్ణయం తర్వాతనే డేట్ ప్రకటించనున్నారని తెలుస్తోంది. వీటిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.