గ్రౌండ్ రిపోర్ట్: త్రిముఖ పోరు
అసెంబ్లీ నియోజకవర్గం: ఇబ్రహీంపట్నం
బీఆర్ఎస్: మంచిరెడ్డి కిషన్ రెడ్డి
కాంగ్రెస్: మల్రెడ్డి రంగారెడ్డి!
బీజేపీ: బూర నర్సయ్య గౌడ్! అశోక్ కుమార్ గౌడ్! నోముల దయానంద్ గౌడ్!
Ibrahimpatnam Constituency Review: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 నియోజవకర్గాల్లో ‘ఇబ్రహీంపట్నం’ ఒకటి. ఇది భువనగిరి పార్లమెంట్ పరిధిలో భాగం. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆ తర్వాత కామ్రేడ్లకు అడ్డాగా మారింది. పొత్తులు, రాజకీయ పరిస్థితులతో ఆ తర్వాత టీడీపీ పాగా వేసింది. ఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా టీడీపీ జెండానే ఎగిరింది. టీడీపీ నుంచి గెలిచిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ గూటికి చేరారు. 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి బరిలోకి దిగి మరోసారి గెలిచి హ్యాట్రిక్ అందుకున్నాడు.
ఇందులో ప్రధానంగా 5 ప్రాంతాలు వస్తున్నాయి. 1. ఇబ్రహీంపట్నం, 2. హయత్ నగర్, 3. మంచాల్, 4. యాచారం, 5. అబ్దుల్లాపూర్ మెట్. ఇక ఇక్కడి ఓటర్ల సంఖ్య తీసుకుంటే 2,21,478. ఈ నియోజకవర్గానికి 17 సార్లు ఎన్నికలు (బైపోల్ తో కలుపుకొని) జరగగా 8 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. 1957 నుంచి 1967 ఎన్నికల వరకు ఎంఎన్ లక్ష్మీ నర్సయ్య హ్యాట్రిక్ విజయం సాధించాడు. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి తిరుగులేకుండా ఉంది. తర్వాతి పరిణామంలో తెలుగుదేశం బలపడుతూ వచ్చింది.
సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఇక్కడ మంచి గుర్తింపు ఉంది. ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పాటు డెవలప్ మెంట్ చేసే నేతగా పేరు సంపాదించుకున్నాడు. ఈయన ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయం సాధించాడు. రెండు సార్లు టీడీపీ తరుఫుణ పోటీ చేసి గెలుపొందిన ఆయన తర్వాత బీఆర్ఎస్ చేరి 2018లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) తరుఫున పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈ సారి సీటును తన కొడుకుకు ఇవ్వాలని కోరినా.. అధిష్టానం మాత్రం ససేమీరా అనడంతో తానే మళ్లీ పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు.
అయితే గతంలో (2018) చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న చందంగా మారింది మంచిరెడ్డి పరిస్థితి. గత కొంత కాలంగా టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్న రాజకీయం రాను రాను బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ ను టికెట్ కోరగా అధిష్టానం నిరాకరించి క్యామ మల్లేశ్ ను బరిలోకి దింపింది. ఇక చేసేది లేక మల్రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేశాడు. కాంగ్రెస్ అభ్యర్థి క్యామ మల్లేష్ కనిపించకుండా పోగా మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం 376 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకున్నా గట్టి పోటీ ఇచ్చాడు మల్రెడ్డి రంగారెడ్డి. ఈ సారి మంచిరెడ్డికి గెలుపు కత్తిమీద సామేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కాంగ్రెస్
ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం రాను రాను టీడీపీ, బీఆర్ఎస్ చేతిలోకి వెళ్లిపోయింది. ఇక్కడ 8 సార్లు విజయం సాధించిన కాంగ్రెస్ కు మంచి కేడర్ ఉన్నా నడిపించే నాయకుడు లేక చీలిపోతోంది. కాంగ్రెస్ కు కేడర్ కు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న మల్రెడ్డి రంగారెడ్డికి 2014 టికెట్ దక్కింది. కానీ ఆయన దాదాపు 10 వేల ఓట్ల తేడాతో మంచిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2018లో కూడా తనకే టికెట్ ఇవ్వాలని కోరినా అధిష్టానం కేటాయించలేదు. దీంతో బీఎస్పీ తరుఫున పోటీ చేశాడు. కేవలం 376 ఓట్లతో ఓటమిపాలయ్యారు. ఈ సారి కూడా తనకే టికెట్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ఈయనకు టికెట్ ఇస్తే ఈ సారి గెలుపు ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
భారతీయ జనతా పార్టీ
ఈ నియోజకవర్గంలో బీజేపీ కూడా బలంగానే ఉంది. పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ నియోజవకవర్గాల్లో బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ ఓటు బ్యాంకు కూడా ఎక్కువగానే ఉంది. ఇక ఈ టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. అందులో ఒకరు అశోక్ కుమార్ గౌడ్, రెండు నోముల దయానంద్ గౌడ్ వీరిలో ఒకరు పోటీ పడుతున్నారు. వీరితో పాటు బూర నర్సయ్య గౌడ్ కూడా ఇదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. గతంలో భువనగిరి ఎంపీగా విజయం సాధించారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయనకు ఇక్కడ అనుచరులు ఎక్కువగానే ఉన్నారు. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఈ ఓటు బ్యాంకును తన ఖాతావైపు మళ్లించుకోవాలని అనుకుంటున్నారు.