TDP-BRS : నలభై ఏళ్లుగా నాటుకుపోయిన అధికార పార్టీకి వ్యతిరేకంగా పార్టీని స్థాపించి తొమ్మది నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. సినీ పరిశ్రమలో తనకున్న ఛరిష్మాతో, ప్రజాసేవపై అంకితభావంతో రాష్ట్రంలో.. గుత్తాధిపత్య పార్టీ కాంగ్రెస్ విధానాలతో.. విసిగి వేసారిన ఎన్టీఆర్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఆవశ్యకతను, ప్రాధాన్యతను చాటుకున్నారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి ఎన్టీఆర్ పసుపు జెండా పవరేంటో చూపించారు. 1982 మార్చి 29న స్థాపించిన టీడీపీ ఏర్పాటైన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి దేశ రాజకీయాలను శాసించింది. ఎన్టీఆర్ అడుగుజాడల్లో కేసీఆర్ టీడీపీ పార్టీతో రాజకీయ ప్రవేశం చేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 27 ఏప్రిల్ 2001న తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీని స్థాపించారు కేసీఆర్. ప్రజాస్వామిక పోరాటాన్ని ఆయుధంగా చేసుకుని 2 జూన్ 2014న తన పార్టీ లక్ష్యాన్ని సాధించారు. కానీ తెలంగాణ ప్రజలు ఆ పార్టీని అనేక దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల కలగా, పోరాటంగా విశ్వసించారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీ పగ్గాలు అందుకున్న చంద్రబాబు ఉమ్మడి ఏపీలో రెండు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తొమ్మిదేళ్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించి హైదరాబాద్ లో టీడీపీ బ్రాండ్ పాలనను చూపించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా అవకాశం దక్కించుకుని.. ప్రస్తుతం ఐదేళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమయ్యారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ పదేళ్లపాటు అధికారంలో ఉన్నారు. అయితే టీడీపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు అధికారాన్ని, ప్రతిపక్షాన్ని చూసినవే.. కానీ ప్రతిపక్షంలోకి వెళ్లిన ప్రతిసారి టీడీపీ మళ్లీ అధికారాన్ని అందిపుచ్చుకుంటుంది. మరి బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి రాగానే గాలిపోయిన టైర్ లా కుప్పకూలిపోతోంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉంటూ రెచ్చగొట్టే చర్యలు, కించపరిచే విమర్శలు, అరెస్టులు, కేసులను తట్టుకుంది. నాటి వైస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి వైస్ జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన వరకు ప్రజల పక్షాన నిలిచింది టీడీపీ. ఏపీలో 2019 ఎన్నికల్లో విజయం రాష్ట్ర పాలనకు కాకుండా టీడీపీ అంతానికే అన్నట్లు జగన్ ప్రభుత్వం అడుగులు వేసింది. 2024 ఎన్నికల్లో ఏపీలో పసుపు జెండాను పాతిపెట్టాలన్న ఆలోచనలతో ఒక్కో టీడీపీ నేతపై కేసులు పెట్టి, పార్టీ అధినేత చంద్రబాబును జైలుకు పంపింది. ప్రస్తుతం పార్టీ పని అయిపోయిందనుకున్న.. దశ నుంచి టీడీపీ అధికారంలోకి వచ్చే దశకు చేరుకుంది.