CM Revanth : జయాపజయాలు శాశ్వతం కాదు.. ఒక సారి విజయం సాధించినంత మాత్రాన వారినే విజయం ఎప్పుడూ వరిస్తుందనుకోవడం మూర్కత్వం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలంగాణ తీసుకచ్చిన నేత, ఉద్యమ వీరుడు, రాజకీయ వ్యూహకర్త ఇలా చాలా బిరుదులు తగిలించుకొని పదేళ్లు తెలంగాణను ఏలాడు. కానీ ఇప్పుడు మాజీ అని పిలిపించుకుంటున్నాడు. అయితే అధికార దాహం ఉన్న నేతలు మాజీ అనే పేరును ఇష్టపడరు. దీనికి కేసీఆర్ అతీతుడేమీ కాదు.
ఇక, రేవంత్ రెడ్డి తానే సీఎం అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీలో ఒంటరి పోరాటం చేసి మరీ పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చాడు. తానే సీఎం అని ప్రకటింకొని మరీ సీఎం అయ్యాడు. రేవంత్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారని అందరికీ తెలిసిందే. ఎవరు చెప్పినా.. ఎంత చెప్పినా.. వినరు. ఆయన గతంలో ఎలాంటి మంత్రి పదవి చేపట్టలేదు. కానీ.. గత 20 రోజులుగా సీఎంగా రాణిస్తున్నారు. సీనియర్లను కలుపుకుంటూ వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్నారు.
రేవంత్ సీఎంగా చార్జి తీసుకున్న తర్వాత 20 రోజుల పాలనపై బ్యూరోక్రసీలో చర్చ సాగుతోంది. ఆయన బాగానే ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్న భావనను చాలా మంది వ్యక్తం చేశారు. వీరితో పాటు ప్రజల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల్లో రెండింటినీ ఆయన ఇప్పటికే ప్రారంభించారు. కాంగ్రెస్ స్టైల్ కు భిన్నంగా ఎలాంటి వివాదాలు లేకుండా ప్రస్తుతం పాలన కూల్ గానే కొనసాగుతోంది. గతంలో ఏ శాఖను నడపలేకున్నా.. ఆయన పొలిటికల్ మెచ్యురిటీపై పలువురు చర్చించుకుంటున్నారు. సరిగ్గా ఇదే బీఆర్ఎస్ లో కలవరం కలిగిస్తోంది.
కనీసం నెల రోజులు గడవక ముందే రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఫైట్ కు రెడీ అవుతున్నారు. అంటే ఆయన ఇంపాక్ట్ ప్రతిపక్ష పార్టీపై ఏ మేరకు పడుతుందో అర్థం చేసుకోవచ్చు అని వాదనలు వినిపిస్తున్నాయి. ఇక, రేవంత్ చురుకైన రాజకీయం కూడా బీఆర్ఎస్ కు అగ్గి రాజేస్తోందన్న వాదనలు కూడా లేకపోలేదు. 20 రోజుల్లో రేవంత్ రెడ్డి చేసిన పనేంటి? అంటే ప్రతీ రంగంలో శ్వేత పత్రాలు రిలీజ్ చేయడమే. దీని ద్వారా తెలంగాణాలో పదేళ్ల పాలన డొల్లతనం అప్పుల పాలైన ఉదంతం కళ్లకు కట్టినట్లుగా ప్రజల ముందు ఉంచేశారు.
దీంతో బీఆర్ఎస్ నేతలు అలెర్ట్ అవుతున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ కు మరికొంత టైం ఇస్తే ప్రజల వద్ద బీఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో విలన్ గా చూపుతారన్న కలవరం మొదలైంది. రూ. 6.50 లక్షల కోట్ల నుంచి రూ. ఏడు లక్షల కోట్ల దాకా అప్పులు చేశారని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో శ్వేత పత్రం రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. దీంతో ఇప్పుడు తెలంగాణ సమాజం దీని మీద దృష్టి సారించింది. ఏపీ నుంచి విడిపోయాక తెలంగాణలో హైదరాబాద్ వంటి రాజధాని తోడు ఉంది. సంపన్న రాష్ట్రంగా బీఆర్ఎస్ చేతుల్లోకి వెళ్లింది. మరి బీఆర్ఎస్ దిగిపోయేనాటికి ఇన్ని లక్షల కోట్లు అప్పు ఎందుకు చేసిందన్న ప్రశ్న సగటు తెలంగాణ పౌరుడికి కలుగుతుంది.
అదే ప్రస్తుతం కాంగ్రెస్ కు ప్లస్ అవుతోంది. ఆ ఆలోచన జనంలో రేకెత్తించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులను బయట పెట్టడం ద్వారా రేవంత్ రెడ్డి మంచి మార్కులు కొట్టేశారు. ఇదే లెక్కన కాంగ్రెస్ దూకుడు పెంచితే బీఆర్ఎస్ కు చిక్కులు తప్పవని చర్చ జరుగుతోంది. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వేదపత్రం రిలీజ్ అంటు చెప్పవడం మరో వివాదానికి కారణమైంది. తెలంగాణ ప్రజలు చెమటోడ్చి పన్నులు కడితే వచ్చిన సొమ్మును అప్పుల పాలు చేసింది చాలక ‘స్వేద పత్రాలు’ ఏంటని డిప్యూటీ సీఎం భట్టి మండిపడ్డారు.
మొత్తం మీద సీఎం రేవంత్ టీం నిధానంగానే బీఆర్ఎస్ పాలనపై జనంలో చర్చ పెడుతోంది. ఇది చివరికి బీఆర్ఎస్ కు రాజకీయంగా ట్రబుల్ అయ్యేలా ఉందంటున్నారు. ఈ రకమైన పరిణామాలతో బీఆర్ఎస్ ఉలిక్కి పడుతోందట. మరి రేవంత్ రెడ్డికి అట్టే టైం ఇవ్వకుండా ఎటాక్ కి రెడీ అయిపోవడంలోని ఆంతర్యం అదే అని అంటున్నారు.