జీవో 111 ను ఎత్తివేసేందుకు రాష్ట్రా సర్కారు నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహానగరంలోని రెండు ప్రధాన చెరువుల భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేసేలా ఈ జీవోను ఎత్తివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మేధావులు, నిపుణులు మండిపడుతున్నారు. రాష్ర్ట రాజధానిలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులకు పది కిలో మీటర్ల వరకు ఎలాంటి కట్టడాలు నిర్మించకుండా ఈ జీవోను తెచ్చారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం ఈ రెండు చెరువల భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
ఈ రెండు చెరువులూ మానవ నిర్మితమే. 1908 లో మూసీ వరదల కారణంగా అప్పటి నిజాం రాజు ప్రఖ్యాత ఇంజినీర్ మోక్ష గుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి, ఈ రెండు భారీ జలాశయాలను కట్టించారు. వీటిల్లో నీటిని నిల్వ చేసి, జంట నగరాల తాగునీటి ఇక్కట్లను తీర్చేందుకు నిర్ణయించారు. దాదాపు వందేళ్ల నుంచి ఈ జలాశయాలు అదే పని చేస్తున్నాయి. అయితే జీవో నంబర్ 111 ను మాత్రం సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఇచ్చారు.
సమీపంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు సుధానా ఇండస్ర్టీస్ అనే సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కాస్ర్టాయిల్ కాంప్లెక్స్ అనే టెక్నాలజీని తీసుకొని ఈ పరిశ్రమను పెట్టాలని అనుకుంది. అయితే వారికి గండిపేట వద్ద సొంత భూమి ఉండడంతో అక్కడే ఏర్పాటుకు నిర్ణయించారు. అయితే దీనిపై ఫొరం ఫర్ బెటర్ అనే సంస్థ హైకోర్టుకు వెళ్లింది. అక్కడ వారికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో, సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీం కోర్టు రెండు నగరాల తాగునీటి గోసను తీర్చే జలాశయాలను నాశనం చేసేలా పరిశ్రమలను ఏర్పాటు చేయడం సరికాదని అభిప్రాయపడింది. ఆ జలాశయాలను కాపాడేలా ఓ చట్టం ఉండాలని చెప్పింది. దీంతో సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా జీవో 111 ను అప్పటి ప్రభుత్వం తెచ్చింది. ముందుగా 1994లో ఒక జీవో తెచ్చారు. ఆ తర్వాత 1996లో దానిని మార్చి జీవో 111 ను తెచ్చారు. చెరువు సమీపంలో నిర్మాణాలపై ఎన్నో నిబంధనలు ఇందులో ఉన్నాయి. అందుకే ఇప్పటికీ ఈ చెరువులు నీటితో కళకళలాడుతుంటాయి. 7 మండలాల్లోని సుమారు 83 గ్రామాలకు చెందిన భూములు ఈ చెరువుల కింద ఉన్నాయి. శంషాబాద్ మండలంలోని 47 గ్రామాలు, మోయినాబాద్ మండలంలోని 20 గ్రామలు, చేవెళ్ల మండలంలోని 6, శంకరపల్లి, రాజేంద్రనగర్ లలో మూడు చొప్పున, మరికొన్ని గ్రామాలు ఇందులో ఉన్నాయి. అయితే ఈ జీవో కారణంగా అక్కడ భూములు కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ జీవో కు వ్యతిరేకంగా పోరాట సమితి కూడా ఏర్పడింది. ఈ 83 గ్రామాల్లో జీవో కు వ్యతిరేకంగా రెండుసార్లు తీర్మానాలు కూడా చేశారు. అయితే రియల్ ఎస్టేట్ రంగానికి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేలు చేయనుంది.
111 జీవో రద్దు నిర్ణయాన్ని పర్యావరణ ప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు. ఇది మంచి నిర్ణయం కాదని పర్యావరణ నిపుణులు అంటున్నారు. అక్రమ కట్టడాలను నిలుపుదల చేయకుండా, రెండు చెరువుల భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేసేలా సర్కారు నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నది. దీనిపై కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని ఇప్పటికే పలు సంఘాలు రంగంలోకి దిగాయి. మల్లన్న సాగర్ ను చూపించి ఈ రెండు చెరువులను నాశనం చేస్తున్నారని సాగు, తాగు నీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం తమకు ఆదాయ వనరుగానే భావిస్తున్నది. దీనిపై వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఈ జీవో ఎత్తేయాలని ప్రయత్నించినా, ఎందుకో సాధ్యం కాలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ చెరువుల చుట్టూ గ్రీన్ జోన్ ఏర్పాుటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ జీవో తీసేస్తే లక్షా 25 వేల ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది.
అయితే పర్యావరణ నిపుణులు మాత్రం జీవో 111 ఎత్తివేతపై మండిపడుతున్నారు. ఇది విపత్తుకు దారితీస్తుందని అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో జరిగే నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలను కాలరాస్తూ తమ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నారు. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం సమీక్షించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. అయితే మరికొందరు సుప్రీం కోర్టు తలుపు తట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఏడుగురు సభ్యులతో ఒక కమిటీ వేసింది. మరి రానున్న రోజుల్లో ఇన్ని వ్యతిరేకతల మధ్య తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాలి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా పర్యావరణానికి హాని చేసే ఈ నిర్ణయం సరికాదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.