Senior Citizens : అమితాబ్ బచన్ సతీమణిగా, నటిగా, ఎంపీగా గుర్తింపు ఉన్న నేత జయా బచన్. సమాజ్ వాది పార్టీకి చెందిన ఆమె ప్రస్తుతం రాజ్యసభలో ఎంపీగా కొనసాగుతున్నారు. ఆమె ఇటీవల రాజ్యసభలో మాట్లాడిన తీరు పలువురిని ఆలోచింప చేసింది. సీనియర్ సిటిజన్లకు రోజు రోజుకు విలువ తగ్గుతుందన్న ఆమె వారిని బతికుండగానే చంపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. జయా బచన్ పార్లమెంట్ లో వృద్ధుల తరుఫున లేవనెత్తిన సమస్యపై ఎంపీలతో పాటు సమాజం తీవ్రంగా ఆలోచిస్తుంది.
ఆమె ఏమన్నారంటే.. ‘ఈ దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన సీనియర్ సిటిజన్లను ఎవరూ పట్టించుకోవడం లేదు. వారికి ఎక్కడా సరైన గుర్తింపు రావడం లేదు. ప్రభుత్వాలు కూడా వారిపై దృష్టి పెట్టడానికి సిద్ధంగా లేదు. భారతదేశంలో సీనియర్ పౌరుడిగా ఉండటం నేరమా? దేశంలో 70 సంవత్సరాల తర్వాత వైద్య బీమాకు అర్హులు కాదు. EMIపై రుణం పొదలేరు. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు, వారికి ఏ పనీ ఇవ్వరు, అందువల్ల వారు మనుగడ కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది.
వారు పదవీ విరమణ వయస్సు వరకు అంటే 60-65 వరకు అన్ని పన్నులు, బీమా ప్రీమియంలు చెల్లించినవారే. సీనియర్ సిటిజన్లు అయినా కూడా వారు అన్ని పన్నులు చెల్లిస్తూనే ఉన్నారు. దేశంలో సీనియర్ పౌరుల కోసం ఏ పథకం లేదు. రైల్వే/విమాన ప్రయాణంలో 50 శాతం తగ్గింపును కూడా వెనక్కు తీసుకున్నారు. చిత్రమైన విషయం ఏంటంటే రాజకీయాల్లో ఉన్న సీనియర్ పౌరులకు ఎమ్మెల్యే, ఎంపీ లేదా మంత్రికి ప్రతీ ప్రయోజనం ఉంటుంది. వారికి పెన్షన్లు కూడా వస్తాయి. ఇతరులకు (కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు తప్ప) ఇలాంటి ప్రయోజనాలు ఎందుకు కల్పించడం లేదు. పిల్లలు వారి గురించి పట్టించుకోకపోతే, ఎక్కడికి వెళ్తారో తలుచుకుంటేనే భయంగా ఉంటుంది.’ అని సభ దృష్టికి తెచ్చారు.
సీనియర్ సిటిజన్లను బలహీనులుగా భావించవద్దు. దేశంలో యువశక్తి ఎక్కువగా ఉందన్న మాట నిజమే.. అందుకని వృద్ధులను పట్టించుకోకపోవడం మంచి పరిణామం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వృద్ధుల ప్రయోజనాల కోసం చాలా పథకాలు రావాల్సి ఉంది. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు చేస్తుంది. కానీ సీనియర్ సిటిజన్ల గురించి ఎప్పుడూ పట్టించుకోదు. కుటుంబం, స్వీయ పోషణ కోసం వారిలో కొందరు తక్కువ పెన్షన్ పొందుతున్నట్లయితే, అది కూడా ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది. కాబట్టి సీనియర్ పౌరులు కొన్ని ప్రయోజనాల కోసం పరిగణించాలి:
*60 ఏళ్లు పైబడిన పౌరులందరికీ తప్పనిసరిగా పెన్షన్ ఇవ్వాలి
*ప్రతి ఒక్కరికీ హోదా ప్రకారం పింఛన్ కేటాయించాలి.
*రైల్వే, బస్సు, విమాన ప్రయాణాలలో రాయితీ ఉండాలి.
*బీమా తప్పనిసరిగా ఉండాలి, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి.
* కోర్టు కేసుల్లో ముందస్తు నిర్ణయానికి ప్రాధాన్యతివ్వాలి.
*అన్ని సౌకర్యాలతో ప్రతి నగరంలో సీనియర్ పౌరుల గృహాలు నిర్మించేలా చూడాలి.