CM Jagan : ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సీఎం జగన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లలో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు.. వేగంగా పథకాల అమలు.. ఇలా ఆయన పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇదే తరుణంలో రాజ్యసభ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వలేని వారికి రాజ్యసభతో పాటు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టే ప్లాన్ లో జగన్ ఉన్నారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి మూడు స్థానాలు దక్కనున్నాయి. వీటికి సీఎం జగన్ ఎవరినీ ఎంపిక చేస్తారో అని ఆ పార్టీలో ఆసక్తి నెలకొంది.
వచ్చే ఏప్రిల్ లో 55మంది రాజ్యసభ ఎంపీల పదవీ కాలం పూర్తవుతుంది. ఇందులో ఏపీ నుంచి ముగ్గురు పదవీ విరమణ చేస్తారు. వారిలో వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్రబాబు, బీజేపీ నుంచి సీఎం రమేశ్ ఉన్నారు. ఈ ముగ్గురు 2024 ఏప్రిల్ 2న పదవీ విరమణ చేయనున్నారు. ఈ స్థానాల భర్తీ కోసం మార్చిలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డి, బీదా మస్తాన్ రావు వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. దీంతో నెల్లూరు జిల్లాకు మళ్లీ చాన్స్ ఇవ్వడం కష్టమే. తాజాగా అసెంబ్లీ ఎన్నికల మార్పులు, చేర్పులు, కుల సామాజిక సమీకరణాలు.. వీటన్నంటినీ ఆలోచించుకుని సీఎం జగన్ రాజ్యసభ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మూడు స్థానాల్లో ఒక సీటు దాదాపు ఖాయమైనట్టుగా తెలుస్తోంది. వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయ కర్తగా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి హామీ దక్కినట్టు సమాచారం. ఈయనకు 2019ఎన్నికల్లో చోటు దక్కలేదు. ఇప్పుడు అవకాశం ఉండడంతో ఆయనకు కచ్చితంగా స్థానం కల్పించే చాన్సే కనపడుతోంది.
సీఎం రమేశ్, కనకమేడల స్థానంలో వైసీపీ మరో ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒక స్థానం మైనారిటీలకు ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఆ స్థానంలో సినీ నటుడు అలీకి ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు కనపడుతోంది. ఇక మూడో స్థానం.. ప్రస్తుత పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు కేటాయిస్తారని అంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బాలరాజుకు సీటు ఇవ్వడం లేదని సమాచారం. ఈ మూడు స్థానాల భర్తీతో రాజ్యసభలో వైసీపీ బలం 11కు చేరనుంది. అంటే మొత్తం స్థానాల్లోనూ వైసీపీ సభ్యులే ఉండనున్నారు.