దాంపత్య జీవితం కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. దంపతులిద్దరికీ పరస్పరం ఇష్టమైతే విడాకులు తీసుకోవచ్చని వెల్లడించింది. 2016లో ఇద్దరు దంపతులు విడాకుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమకు ఫ్యామిలీ కోర్టుతో సంబంధం లేకుండా నేరుగా విడాకులు మంజూరు చేయాలని సదరు దంపతులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
అయితే వీరి పిటిషన్ను పరిశీలించిన అప్పటి బెంచ్ ఈ కేసును ఐదుగురు సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసానికి బదిలీ చేసింది. ఇక అప్పటి రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును రిజర్వ్ చేసింది. అయితే జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసుపై సోమవారం మళ్లీ విచారణ చేపట్టింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు,కుటుంబ వ్యవస్థను ప్రభావితం చేసే కేసు అయినందున పిటిషన్ను క్షుణంగా పరిశీలించింది. విడాకుల విషయంలో దంపతులు పడే సాదకబాధకాలను పరిగణలోకి తీసుకుంది.
ఈ నేపథ్యంలోనే ధర్మాసనం సంచలనమైన తీర్పును వెలువరించింది. భార్యభర్తలిద్దరూ కలిసి ఉండేందుకు ఇష్టపడకపోతే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవచ్చని తెలిపింది. దంపతులిద్దరికి కలిసి ఉండే ఆలోచన లేనప్పుడు ఒకటిగా ఉండమని చెప్పలేమని స్పష్టం చేసింది. ఇలాంటి విషయాల్లో భార్య,భర్తలు విడిపోవడమే ఉత్తమమని భావిస్తున్నట్లు పేర్కొంది. అందుకే ఈకేసులో సుప్రీంకోర్టుకున్న విశేష అధికారాలను ఉపయోగించుకొని ఈ తీర్పును ఇస్తున్నట్లు బెంచ్ వెల్లడించింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఈ అధికారాలను వినియోగించుకొని తీర్పును వెల్లడిస్తున్నట్లు ప్రకటించింది. వ్యక్తి స్వేచ్చా,వారికి గల హక్కులు కాలరాయొద్దనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి జడ్జ్మెంట్ను పాస్ చేసినట్లు కౌల్ తెలియజేశారు. మరోవైపు దేశ సర్వోన్నత న్యాయస్థానమే దంపతుల విడాకుల విషయంలో ఈరకమైన తీర్పును ఇవ్వడంతో..మున్ముందు కలిసి ఉండాలనే ఆలోచన లేని భార్య,భర్తలకు ఇదొక్క సువర్ణావకాశం లాంటి తీర్పు కానుంది.