- పేదలకు అండగా నిలిచేలా అడుగులు
- కోర్టు అనుకూల తీర్పుతో ప్రభుత్వ చర్యలు
CM Jagan key decision on Amaravati ఏపీలో అమరావతిపై జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతి ఆర్ 5 జోన్లో భూములపై ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టులో తీర్పు రావడంతో ఇక వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే జగన్ అధికార యంత్రంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలో ఇండ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం 1134 ఎకరాల భూమిని కేటాయించింది. కాగా, తాజాగా మరో 268 ఎకరాలను అదనంగా ఇచ్చేందుకు నిర్ణయించింది. 50 వేల మంది పేదలకు ఇండ్ల స్థలాలే లక్ష్యంగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
268 ఎకరాలు వారి కోసమేనా..?
కాగా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని అర్హులైన పేదలకు లబ్ధి చేకూర్చేలా వైసీపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు పూర్తిగా సిద్ధం చేశారు. రాజధానిలో ఉన్న బోరుపాలెం, అనంతవరం, నెక్కల్లు, తదితర గ్రామాల్లోని ఈ భూములకు ధర కట్టి విక్రయించేందుకు సమ్మతిని తెలియజేస్తూ ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఇప్పటికే సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎకరాకు రూ. 24.40 లక్షల చొప్పున మొత్తం 268 ఎకరాలకు ప్రభుత్వానికి విక్రయించాలని సీఆర్డీఏ నిర్ణయించింది.
సుప్రీం కోర్టులో పంచాయతీ..
కాగా, అమరావతిలో ఒకవైపు పేదలకు ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు స్థానిక రైతులు సుప్రీం కోర్టు మెట్లెక్కారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్తోందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ప్రభుత్వం మాత్రం పేదలకు ఇండ్లు ఇచ్చి తీరుతామని స్పష్టం చేస్తున్నది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ పరిరక్షణ సమితి రాష్ర్ట అధ్యక్షుడు కే శ్రీనివాస్రావు మాత్రం అమరణ దీక్షకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పేదలకు ఇండ్లు ఇస్తుంటే జీర్ణించుకోలేకే టీడీపీ వెనుక ఉండి కుట్రలు చేస్తున్నదని వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇండ్లు కార్యక్రమం మరి సుప్రీం కోర్టు తీర్పు వచ్చేవరకు వేచి చూస్తరా.. లేదంటే హైకోర్టు అనుకూల తీర్పు నేపథ్యంలో ఇక పంపిణీకి సిద్ధమవుతారో మరి కొన్ని రోజుల్లో తేలనుంది.