Jailor : కరోనా వెనక్కి వెళ్తుండడంతో అన్ని రంగాలు అంతే వడి వడిగా ముందుకు నడుస్తున్నాయి. కానీ ఇందులో ఇంత వరకు కోలుకోలేని దెబ్బపడిన రంగం సినిమా ఇండస్ట్రీ. కరోనా సమయంలో ఓటీటీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింటి. ప్లాట్ ఫారాలు పెరిగాయి. దీంతో సినిమా తీస్తున్న సమయంలోనే డిజిటల్ హక్కులను ఫస్టే ప్రొడ్యూసర్లు తీసుకొని కొన్ని రోజులకే ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు. దీంతో థియేటర్లు పూర్తిగా వ్యాపారాన్ని కోల్పోతున్నాయి. సినిమా హాల్స్ ప్రేక్షకులను తీసుకురావడం తలకుమించిన భారంగా మారింది.
ఇటీవల రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రాలకు ఆదరణ లేకపోవడమే ఇందుకు నిదర్శనం. గుడ్డి కన్నా మెల్లె నయం అన్నట్లుగా తెలుగు, తమిళం, మలయాళం భాషల సినిమాలు థియేటర్లకు కొంచెం ఊపిరి పోస్తున్నాయి. గత వారం టాలీవుడ్, కోలివుడ్ తో పాటు బాలీవుడ్ లో భారీ సినిమాలు రిలీజైన విషయం తెలిసిందే. రజనీకాంత్ ‘జైలర్’, చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’, అక్షయ్ కుమార్ చేసిన ‘ఓ మై గాడ్-2’, సన్నీ డియోల్ ‘గదర్2’ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఆగస్ట్ 11 నుంచి 13 వరకు ఈ మూవీస్ రూ.390 కోట్ల (గ్రాస్)కు పైగా వసూళ్లు రాబట్టినట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో వీకెండ్లో ఇన్ని కోట్ల కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారని స్పష్టం చేసింది. ఈ వారం దేశ వ్యాప్తంగా 2.10 కోట్ల మంది థియేటర్లో సినిమాల చూశారట. పదేళ్లలో ఈ స్థాయిలో ప్రేక్షకులు థియేటర్కు రావడం రికార్డు అని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శిబాశీష్ సర్కార్, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కమల్ సంతోషం వ్యక్తం చేశారు.
దూసుకెళ్తున్న ‘జైలర్’
రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘జైలర్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు వసూళ్లను రాబడుతుంది. వీకెండ్ ముగిసే సమయానికి రూ.300 కోట్ల (గ్రాస్)కు దగ్గరగా కలెక్షన్లను రాబట్టింది. ఈ మార్కును అత్యంత వేగంగా అందుకున్న రెండో చిత్రం ‘జైలర్’కావడం విశేషం. గతంలో రజనీ నటించిన ‘2.O’ 4 రోజుల్లోనే రూ.400 కోట్లు(గ్రాస్) వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ‘జైలర్’ హవా కొనసాగుతోంది. 4 రోజుల్లో రూ.32కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం పేర్కొంది.
రాణించిన పీవీఆర్, ఐనాక్స్ షేర్లు
వీకెండ్ వసూళ్లు రాణించడంతో పీవీఆర్ షేర్లు సోమవారం కొంత మేర లాభపడ్డాయి. షారుక్ ‘జవాన్’, ప్రభాస్ ‘సలార్’, ఆయుష్మాన్ ఖురానా ‘డ్రీమ్ గర్ల్ 2’ వంటి చిత్రాలు వసూళ్లు రాబడతాయని అంచనాలు పెరుగుతున్నాయి. పీవీఆర్, ఐనాక్స్ సంస్థలు విలీనం అనంతరం దేశ వ్యాప్తంగా 115 నగరాల్లో 1708 స్క్రీన్లు ఉన్నాయి.