CM KCR :
ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి రాను రాను రాజకీయ పార్టీగా మారింది. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత వచ్చిన 2014 ఎన్నికల నుంచి తన సత్తా చాటుతూనే ఉంది. 2014లో ఏక పక్షంగా గెలిచిన పార్టీ 2018లో కూడా భారీగానే సీట్లను దక్కించుకుంది. ఇక 2023లో మాత్రం కొంత తడబడుతుందనే చెప్పాలి. టీఆర్ఎస్ కాస్తా భారత రాష్ట్ర సమితిగా మారింది. గతంలో టీఆర్ఎస్ పేరుతో పోటీ చేసిన పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో తలపడబోతోంది.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఫస్ట్ లిస్ట్ ను గత నెల (ఆగస్ట్) 21వ తేదీన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. ఈ సారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు గజ్వేల్ తో పాటు కామారెడ్డి బరిలో కూడా నిలవనున్నారు. రెండు సార్లు (2014, 2018) గజ్వేల్ నుంచి పోటీ చేసి కేసీఆర్ విజయం సాధించారు. ఈ సారి (2023) కూడా ఆ స్థానంతో పాటు మరో చోటు నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. అయితే గజ్వేల్ నుంచి కేసీఆర్ పై హేమా హేమీలు పోటీ చేస్తామని చెప్పడంతో.. సేఫ్ సైడ్ కోసం కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తానని ప్రకటించాడు.
అక్కడ అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న కేసీఆర్ ఏ మాత్రం చేశాడో చూడాలని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గం ఇన్ చార్జి రమణారెడ్డి గజ్వేల్ టూర్ ఏర్పాటు చేశాడు. దాదాపు 100 వాహనాల్లో కామారెడ్డి ప్రజలను తీసుకెళ్లి అక్కడి జరుగుతున్న అభివృద్ధిని చూపిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు ఈ టూర్ ను అడ్డుకున్నారు. దీంతో బీజేపీకి ఇది బాగా కలిసి వచ్చింది. కాగా ఇక్కడి బీఆర్ఎస్ ముఖ్య నేతలను సీఎం ప్రగతి భవన్ కు పిలిపించుకోనున్నారు. ఈ నెల 7వ తేదీన వారితో సమావేశం నిర్వహించి బహిరంగ సభలు, ర్యాలీలు తదితరాలపై సూచనలు ఇవ్వనున్నారు.
దీంతో పాటు ఏకగ్రీవాలు కూడా ఆయనకు మైనస్ అయ్యేలా ఉన్నాయి. కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు 9 గ్రామాలకు చెందిన పంచాయతీ లెటర్ హెడ్ పై తీర్మానాలు చేసి ఎమ్మెల్సీ కవితకు అందజేశారు. ఈవిషయంలో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. అక్కడ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కూడా సభ్యత్వాలు ఉన్నాయని ఈ నేపథ్యంలో ఏకగ్రీవం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. పైగా ఇలాంటి వాటికి గ్రామ పంచాయతీ లెటర్ హెడ్ ను ఎలా ఉపయోగించుకుంటున్నారని ఎన్నికల అధికారికి షబ్బీర్ అలీ ఫిర్యాదు చేశాడు. ఇది కూడా కేసీఆర్ గ్రాఫ్ ను చాలా వరకు తగ్గిస్తుందన్న టాక్ వినిపిస్తుంది.