- పవన్ పర్యటన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలా..?
Pawan visit Konaseema : ముఖ్యనేతల పర్యటనలకు వస్తున్నారంటే కొందరు అధికారుల తీరు అంతా ఇంతా కాదు. సమస్యలు ఏళ్లకొద్ది కళ్లకు కనిపిస్తున్నా పట్టనట్లు వ్యవహరించే యంత్రాంగం ముఖ్య నేతలు వస్తున్నారంటే మాత్రం హడావుడి చేస్తారు. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అదే జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నారని రాత్రికే రాత్రే దిద్దుబాటు చర్యలకు దిగారు అక్కడి అధికారులు. ఏకంగా కూలీల అవతారమెత్తారు
విషయం ఏంటంటే..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పంచాయతీ ఉద్యోగులు మంగళవారం అర్ధరాత్రి కూలీలుగా మారారు. హడావుడిగా తడిసిన ధాన్యాన్ని సంచుల్లో ఎత్తి తరలించారు. పవన్ టూర్ నేపథ్యంలో వీఆర్ఏలు, వీఆర్వోలు, వీఏవోలు ట్రాక్టర్లలో కూలీలుగా మారి ధాన్యాన్ని తీసుకెళ్లారు. అర్ధరాత్రి కూలీలు అందుబాటులో లేకపోవడంతో స్థానిక ఆర్డీవో పర్యవేక్షణలో ఉద్యోగులే కూలీల అవతారమెత్తారు. సంచులు నింపుకొని వెళ్లారు. బైక్లపై గన్నీ సంచులను తీసుకెళ్తున్న వీడియోలు బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చీకట్లోనే ట్రాక్టర్లలో తడిసిన ధాన్యాన్ని తరలించారు.
పవన్ పర్యటన నేపథ్యంలోనేనా..?
జనసేన అధినేత పవన్ పర్యటన నేపథ్యంలోనే ఉద్యోగులు ఇలా కూలీలుగా అవతారమెత్తారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని అధికారులు రాత్రికి రాత్రే ధాన్యాన్ని తరలించడం పై మండిపడుతున్నారు. నాయకులు వస్తేనే పేద రైతులను పట్టించుకుంటారా.. అని విమర్శిస్తున్నారు. కేవలం ఓ పార్టీ నాయకుడు వస్తున్నాడని అధికారులు ఇలా రాత్రికి రాత్రే తరలించడం విమర్శలకు తావిస్తున్నది. రాజుపాలెం అధికారుల తీరుపై రైతులంతా మండిపడుతున్నారు. కాలం కలిసి రాక నష్టపోయిన రైతుల ఆవేదనను పట్టించుకోకుండా ఇలా తడిసిన ధాన్యాన్ని రాత్రికి రాత్రే తరలించి చేతులు దులుపుకోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వీలైతే తమను ఆదుకోవాలని ఎదురుచూస్తున్న రైతులను పట్టించుకోవాలని కోరుతున్నాయి.