Series of shocks to BRS : తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు సునాయసమే. అధికార పార్టీగా ఆ పార్టీకి పూర్తి అడ్వాంటెజ్ ఉంది. ఇది నిన్నటివరకు మాట. ఇప్పుడు పరిస్థితి మారుతున్నదా..? గెలుపు అంత ఈజీ కాదనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఉద్యమ పార్టీగా, తెలంగాణను సాధించిన పార్టీగా ప్రజల గుండెల్లో ఇన్నాళ్లూ దాగిన టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. ఇక ఆ తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి. దేశంలో బీజేపీకి ప్రత్యా్మ్నాయం బీఆర్ఎస్సే అంటూ బయలుదేరిన పార్టీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ముందుగా రాష్ర్టంలో కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కాదు.. బీ టీం అంటూ రాష్ర్టంలో మునుపెన్నడూ లేనంత జోష్ తో కాంగ్రెస్ దూసుకువచ్చింది.
అయితే ఈ పోరులో గెలుపెవరిది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక జరుగుతున్న ఘటనలు బీఆర్ఎస్ కు షాక్ మీద షాక్ నిస్తున్నాయి. ఎక్కడో తేడా కొడుతున్నది అనేలాగా పరిస్థితులు ఎదురవుతున్నాయి. షెడ్యూల్ రాగానే 20 మందికి పైగా అధికారులపై ఈసీ వేటు వేసింది. ఇందులో నలుగురు కలెక్టర్లు, పోలీస్ అధికారులు ఉన్నారు. ఇది నిజంగా బీఆర్ఎస్ కు అతి పెద్ద షాక్. గత ఎన్నికల్లో ఆ పార్టీకి పోలీసులు పెద్ద ఎత్తున సహకరించారని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపించాయి. దీంతో పాటు ఆ పార్టీ గుర్తును పోలిన గుర్తులను కేటాయించొద్దని బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈసీని ఈ మేరకు ఆదేశాలివ్వాలని కోరింది. అయితే ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. బీఆర్ఎస్ వాదనను తోసిపుచ్చింది. ప్రజలకు అన్ని తెలుసునని స్పష్టం చేసింది. ఇది మరో దెబ్బ.
ఇక విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య ప్రభుత్వం మెడకు చిక్కుకునే పరిస్థితి వచ్చింది. చివరాఖరుకు మంత్రి కేటీఆర్ ప్రవళిక తల్లిదండ్రులను పిలిచి మాట్లాడడం, వారు తర్వాత మాట మార్చడం చకచకా జరిగిపోయాయి. శివరాం ను ఈ ఘటనలో దోషిని చేసే ప్రయత్నం జరిగిందనే అభిప్రాయం ప్రతిపక్షాల నుంచి వినిపించింది. అయితే శివరాం పోలీసులకు కాకుండా కోర్టు ముందు లొంగిపోవడం తో ఇక ఈ ఘటనలో ప్రభుత్వ జోక్యం లేకుండా పోయింది.
ఇప్పటికే పార్టీలో కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం సహా కేసీఆర్ అనారోగ్యం తదితర ఇక్కట్లతో బీఆర్ఎస్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. మరి ఇలా వరుస షాక్ లతో మరింత ఇరకాటంలో పడుతున్నది. ఏదేమైనా తెలంగాణలో అతి బలమైన పార్టీగా ఉన్న బీఆర్ఎస్ మరి ఈ ఎన్నికల్లో చెమటాడ్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో బేరీజు వేసుకుంటే మంచిదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నది.