Singer Chinmayi : దేశంలో ఇటీవల మహిళా సాధికారత, పురుషాధిక్యతపై చర్చ ఎక్కువైన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు, కోర్టులు కూడా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాదు..వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు, తీర్పులు ఇస్తున్నాయి. అయినా కూడా మహిళలపై లైంగిక దాడులు, పరుష పదజాల ప్రయోగాలు, సోషల్ మీడియాలో హరస్ మెంట్ పెరుగుతూనే ఉన్నాయి.
దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కొందరు సినీ మహిళా జనాలు స్పందిస్తూనే ఉంటారు. వీరిలో సింగర్ చిన్మయి ముందంజలో ఉంటారు. మహిళలకు జరిగే అన్యాయంపై ఆమె స్పందిస్తూనే ఉంటారు. పురుషాధ్యికత ధోరణిని ప్రశ్నిస్తూనే ఉంటారు.
తాజాగా అర్ధరాత్రి ఆడవాళ్లకు బయట పనేంటి? అని సీనియర్ నటి అన్నపూర్ణపై సింగర్ చిన్మయ్ శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఆమె ఉద్దేశంలో రాత్రివేళ మెడికల్ ఎమర్జెన్సీలో మహిళా డాక్టర్లు, నర్సులు ఉండొద్దు. బాత్రూమ్ సౌకర్యం లేని గ్రామాల్లో మహిళలు తెల్లవారుజామున పొలాల వైపు వెళ్తే ఆఘాయిత్యాలకు పాల్పడే మగవాళ్లు ఉన్న సొసైటీ ఇది. వీరి మాటలు వారికి మద్దతిచ్చేలా ఉన్నాయి. ఇలాంటి దేశంలో మనం పుట్టడం మన ఖర్మ’’ అని మండిపడ్డారు.
సినీ జనాల్లో కొందరు మహిళా పెద్దలు.. నేటి తరం నటీమణులు సంప్రదాయబద్ధంగా ఉండాలని, ఆధునీకత పేరిట అభాసుపాలు కావొద్దని హితువు పలుకుతుంటారు. అలాంటివారిలో సీనియర్ నటి అన్నపూర్ణ ముందుంటారు. మహిళలు పద్ధతిగా ఉండాలని, చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవడం, అధునాతన పబ్ సంస్కృతిని ఆమె వ్యతిరేకిస్తుంటారు. ‘‘ఆకు వచ్చి ముల్లు మీద పడ్డ..ముల్లు వచ్చి ఆకు మీద పడ్డ నష్టం ఆకుకే’’ అన్న సామెత ప్రకారం అమ్మాయిలు పద్ధతిగా ఉంటేనే మంచిది అన్న భావనతో అన్నపూర్ణ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అధునాతన భావనలు ఉన్న చిన్మయ్ ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నట్లుగా అర్థమవుతోంది.