![INDIA Vs USA](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/IND-VS-USA.jpg)
INDIA Vs USA : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, యూఎస్ఏ పై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అమెరికాను మొదటి ఓవర్ లోనే అర్షదీప్ సింగ్ వణికించాడు. మొదటి ఓవర్ లో ఫస్ట్ బాల్ కే శయన్ జహింగీర్ ను డకౌట్ చేశాడు. మొదటి ఓవర్ చివరి బంతికి వన్ డౌన్ బ్యాట్స్ మెన్ ను అండ్రీస్ ను ఔట్ చేశాడు. దీంతో మూడు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి అమెరికా పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది.
యూఎస్ఏ ఫస్ట్ ఇన్సింగ్స్ లో నిర్ణీత 20 ఓవర్లలో 111 పరుగులు చేసింది. ఓపెనర్ బ్యాటర్ టేలర్ 24 పరుగులు, మిడిలార్డర్ బ్యాటర్ నితీశ్ కుమార్ 27 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ నాలుగు ఓవర్లు వేసి కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. హర్దిక్ పాండ్యా నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసి కేవలం 14 పరుగులే ఇచ్చాడు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే విరాట్ కొహ్లి సౌరభ్ నేత్రవల్కర్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం మూడు పరుగుల వద్దే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వెనుదిరిగాడు. దీంతో టీం ఇండియా కష్టాల్లో పడింది. రిషబ్ పంత్ 18 పరుగులు చేసి ఔట్ కాగా.. బౌలింగ్ కు సహకరిస్తున్న పిచ్ పై అమెరికా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాట్స్ మెన్ పై ఆధిపత్యం చెలాయించారు.
కానీ సూర్య కుమార్ యాదవ్, శివమ్ దూబె ఆచి తూచి ఆడుతూ.. సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. చివర్లో దూకుడు పెంచిన సూర్య తనదైన షాట్లో అలరించాడు. 49 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 50 పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించాడు. దీంతో ఇండియా సూపర్ విక్టరీ సాధించింది.