Gulebavali Miracle Story : ఎన్టీఆర్ కోసం అద్బుతమైన పాటలు రాశారు సినారె. సినీ కవిని అనిపించుకోవడం ఆయనకు ఇష్టం లేదు. సింహద్వారాన్నే వస్తాను, సినీ సీమను శాసిస్తాను అని సినారె పంతం పడితే ఆయన కోరికను తీర్చినవారు నందమూరి తారక రామారావు. ఆయన స్వీయ దర్శకత్వంలో సొంతంగా 1962లో నిర్మించిన గులేబకావళి కధ సినిమా ద్వారా నారాయణరెడ్డి సినీ గేయ రచయితగా రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో మొత్తం పాటలు సినారె అద్భుతంగా రాసి శభాష్ అనిపించుకున్నారు.
ఆ సినిమాలో ‘ నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని’ అనే పాట తెలుగు సినిమా ఉన్నంతవరకూ ఉంటుంది. ఈ పాట ఎన్టీయార్ కి ఎంతో ఇష్టం. ఇందులోనే యువతను ఉర్రూతలూగించిన “మదనా సుందర నా దొరా…” పాట, “వంటిరినై పోయాను…” అనే విషాదగీతం, “సలామ లేకుం… సాయెబుగారూ…” అంటూ ఉర్దూ పదాలు పలికిస్తూ రాసిన పాట అన్నీ జనాన్ని మురిపించాయి. ఇక “కలల అలలపై తేలె మనసు మల్లెపూవై…” పాట సంగీతసాహితీప్రియులను ఆకట్టుకుంది. జోసెఫ్ కృష్ణమూర్తి స్వరకల్పనలో సినారె రాసిన పాటలన్నీ ‘గులేబకావళి కథ’కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆ మీదట సినారె మూడున్నర దశాబ్దాల పాటు ఎన్నో సినిమాలకు పాటలు రాసి తన కలానికి అలుపు లేదని నిరూపించుకున్నారు. ఆయన రాసిన ఎన్నో పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. దుర్యోధనుడికి పాటను పెట్టాలని ఎన్టీయార్ కి కొంటె కోరిక కలిగితే ఆ పాటను సవాల్ గా తీసుకుని రసికుల మనసుల్లో తరతరాలూ మధురిమలు గుభాళించేలా సినారె ఓ చక్కని గీతాన్ని ఏర్చి కూర్చారు. ఆ పాటే ” చిత్రం భళారే విచిత్రం”. అలా అలవోకగా సుయోధనుడి మీద పాట రాసి ఎన్టీయార్ కే సినారె షాక్ తినిపించేశారు. ఇప్పటికీ ఆ పాట సూపర్ డూపర్ హిట్టే మరి.
‘గులేబకావళి కథ’ తరువాత యన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘శ్రీక్రిష్ణపాండవీయం’లో సినారె కలం పలికించిన ‘స్వాగతం…సుస్వాగతం…’ పాట ఈ నాటికీ స్వాగత గీతంగా జేజేలు అందుకుంటూనే ఉంది. ‘వరకట్నం’లో “ఇదేనా మన సంప్రదాయమిదేనా…” అంటూ దురాచారాన్ని ఎండగట్టిన వైనం ఇప్పటికీ తగినట్టుగానే అనిపిస్తుంది. “తెలుగుజాతి మనది.. నిండుగ వెలుగుజాతి మనది…” అంటూ ‘తల్లా-పెళ్ళామా’లో చాటిన వైనం పులకింపచేస్తుంది. ‘దానవీరశూరకర్ణ’లో “జయీభవా విజయీభవా…” అంటూ అలరించారు.
ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన “తాతమ్మ కల, చాణక్య-చంద్రగుప్త, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీరామపట్టాభిషేకం, శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, చండశాసనుడు, బ్రహ్మర్షి విశ్వామిత్ర, సమ్రాట్ అశోక” అన్నిటా సినారె పాట పల్లవించింది. ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘సమ్రాట్ అశోక’లోనే కాదు, ఆయన నటించగా విడుదలైన ఆఖరి సినిమా ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’లోనూ సినారె పాటలు పలికించడం విశేషం. ఇలా రామారావుతో కడదాకా అనుబంధంతో సాగారు సినారె. ఎన్టీఆర్ ను సినారె “కారణ జన్ముడు… రణ జన్ముడు…” అంటూ తరచూ కీర్తించేవారు. రామారావు తుదిశ్వాస విడిచిన రోజున పసిపిల్లాడిలా సినారె కన్నీరుమున్నీరయ్యారు.