Team India : ప్రపంచ కప్ కు ముందు వ్యక్తిగతంగా, కెరీర్ కు సవాల్
5 మ్యాచ్ల T20 సిరీస్లో భారత జట్టు ఆగస్టు 6న గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో రెండో మ్యాచ్ ఆడనుంది. T20 సిరీస్లో, టీమిండియా మొదటి మ్యాచ్లో ఓడి సిరీస్లో 0-1తో వెనుకబడి ఉంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా రెండో టీ20లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నది. తొలి టీ20లో కరీబియన్ చేతిలో ఓడిన భారత్ ఈరోజు ఎదురుదాడి చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. రోవ్మన్ పావెల్ నేతృత్వంలోని విండీస్ జట్టు తొలి మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసింది.
ఐపీఎల్ లో మెరపులు
టీమిండియా ప్లేయర్లు ఐపీఎల్లో ఆరితేరిన వారే. ఐపీఎల్ తమ బ్యాటింగ్ లో పరుగుల వరద పారించారు. తొలి టీ20లో ఓ మామూలు లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిలపడ్డారు. వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో తమ సత్తా నిరూపించుకోవడం కుర్రాళ్లకు ఇదో మంచి అవకాశం. వారి కెరీర్ కు ఎంతో కీలకం. టీమిండియా బ్యాటింగ్ లైనప్ పుంజుకోవాల్సి ఉంది.
టీమిండియాలో శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ బ్యాట్స్మెన్ ఉన్న భారత జట్టులో అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ స్పిన్నర్లుగా ఉన్నారు. అయితే తొలి మ్యాచ్లో ఓటమి తర్వాత ఈరోజు టీమ్ ఇండియాలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
రెండో మ్యాచ్ గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరగనుంది. ట్రినిడాడ్లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. పిచ్ కారణంగా తొలి మ్యాచ్లో తక్కువ స్కోర్ కే పరుగులు ముగిశాయి. ప్రొవిడెన్స్ పిచ్ కూడా టీమిండియాకు అంత అనుకూలంగా లేదు. ఇక్కడ నికోలస్ పూరన్ ఫామ్ కొనసాగితే వెస్టిండీస్ జట్టు పరుగుల వరద పారిస్తుంది. జాసన్ హోల్డర్ బంతితో విధ్వంసం సృష్టించగలడు.
గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం ఫాస్ట్ బౌలర్లకు పూర్తిగా అనుకూలం దీంతో చాలా మ్యాచ్లు తక్కువ స్కోర్కే పరిమితమవుతున్నాయి. ఇక్కడ తొలి ఇన్నింగ్స్లో సగటు స్కోరు 123 పరుగులు మాత్రమే. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పరుగులు చేయడం కష్టతరమవుతుంది. స్లో వికెట్లలో స్పిన్ బౌలర్లకు కూడా కొంత సానుకూలంగా ఉంటుంది. అయితే ఇటీవల జరిగిన టీ20 ఇంటర్నేషనల్లో ఇక్కడ కూడా 150 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇక్కడ అత్యధిక పరుగులు సాధించే జట్టు గెలుస్తుంది.
వాళ్లు రాణించాలి..
టీమ్ ఇండియా గెలవాలంటే బ్యాటింగ్ లైనప్ మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉన్నది. ఐపీఎల్ లో ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్లు జట్టులో ఉన్నారు. తొలి టీ20లో భారత బ్యాటర్లు.. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. మందకొడి పిచ్పై పరుగులు సాధించడం అంత సులువు కాదు. టీమిండియా లాంటి బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్టుకు పరుగులు చేధించడం పెద్ద సవాల్ కాదు. కానీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్య, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగతంగానూ, సమష్టిగానూ తమ ఆటతీరు మరింత మెరుగు పడాల్సి ఉంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్తోపాటు సంజు శాంసన్ కూడా బ్యాటింగ్ లో తడబడుతున్నాడు. తొలి మ్యాచ్లో బ్యాటింగ్లో తిలక్ వర్మ ఎంతో ఆకట్టుకున్నాడు. చక్కని షాట్లతో అలరించాడు. అయితే తిలక్ ఈ మ్యాచ్లోనూ అదే జోరు చూపుతాడని జట్టు ఆశిస్తోంది. కాగా బలమైన లోయర్ ఆర్డర్ లేకపోవడం భారత్కు మరో ప్రతికూలాంశం.