Vasireddy Padma :
ఏపీలో వలంటీర్ల వ్యవస్థఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్లు చేశారు. ఇక ఆ రోజు నుంచి వైసీపీ నేతల ఎదురుదాడి కొనసాగుతున్నది. ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెడుతూ పవన్ ను తిట్టిపోస్తున్నారు. జనసేనానికి కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు వలంటీర్లను రంగంలోకి దింపి, పవన్ దిష్టిబొమ్మల దహనాలు చేయించారు. పవన్ పై పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా వేయించారు. ఇక్కడితో ఆగకుండా న్యాయ పర చర్యలకు కూడా దిగారు. ఇక తాజాగా వైసీపీలోని ఓ కీలక మహిళా నేత రంగంలోకి దిగారు. కొంత ఆలస్యంగా స్పందించిన ఆమె, పవన్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది దేశవ్యాప్త సమస్య అని, కేవలం ఏపీకే పరిమితం చేయాలని కొందరు కుట్ర పన్నారని మండిపడ్డారు.
ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ అసలు మహిళల మిస్సింగ్ అంశం పవన్ కు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ తో సహా అనేక రాష్ర్టాల్లో మిస్సింగ్ లు ఉన్నాయని వాటిపై ఎందుకు మాట్లాడరని ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. కేంద్రం కూడా మహిళల మిస్సింగ్ వివరాలు బయటపెట్టడంతో ఇక ఆమె ఏదో చెప్పుకుని చేతులు దులుపుకునేందుకు ప్రయత్నించారని విమర్శలు కూడా వచ్చాయి. మహిళల మిస్సింగ్ లో ఏపీ 11 వస్థానంలో ఉందని, మరి పవన్ ఎందుకు ఇంత స్థాయిలో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మిస్సింగ్ లు ఎందుకవుతున్నాయో చెప్పకుండా పవన్ పై ఆరోపణలకే పరిమితమయ్యారు. ఏపీలో వలంటీర్ల ద్వారా మహిళల మిస్సింగ్ అంటున్న పవన్ కళ్యాణ్ మరి తెలంగాణలో కూడా మిస్సింగ్ ల పై మాట్లాడాలని సవాల్ విసిరారు. సినిమాల్లో పవన్ తీసిన లవ్ స్టోరీల ద్వారానే అమ్మాయిల మిస్సింగ్ లు పెరిగాయని ఒకరంగా ఆయనపై నెపం నెట్టేసే ప్రయత్నం చేశారు.
వలంటీర్ల ఏపీలో దేవుళ్లలా మారారని చెప్పుకొచ్చారు. వారి వల్లే ప్రజలకు పథకాలు సకాలంలో అందుతున్నాయని తెలిపారు. ఏపీలో పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడే కాదు. పిచ్చి పుత్రుడు అంటూ విమర్శలు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం పని చేస్తున్న సంస్థల మీద పవన్ ఆరోపణలు సరికాదని మండిపడ్డారు. మహిళల సమక్షంలో రచ్చబండ పెడుతామని, పవన్ కు దమ్ముంటే అక్కడి కి రావాలని సవాల్ విసిరారు. పవన్ వల్లే మహిళలు ఆగం అవుతున్నారని, సీఎం జగన్ మహిళలను ఆదుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అయితే కేవలం పవన్ పై ఏదో నెపం పెట్టేందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టినట్లు ఉందని, మహిళల మిస్సింగ్ పై ఒక మహిళగా ఆమె స్పందించిన తీరు బాగాలేదని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కామెంట్లు పెడుతున్నారు.