Irigela brothers Jana Sena : ఏపీలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇన్నాళ్లు వైఎస్సార్పీపీలో ఉన్న ఇరిగేల రాంపుల్లారెడ్డి, బ్రదర్స్ జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఇరిగెల బ్రదర్స్ ఇరిగెల రామచంద్రారెడ్డి, ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి, ఇరిగెల విశ్వనాథ్ రెడ్డి, ఇరిగెల ప్రతాప్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి జనసేనాని ఆహ్వానించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి సూచించారు.
42 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్న ఇరిగెల బ్రదర్స్ గతంలో కాంగ్రెస్, టీడీపీలో పని చేశారు. 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా కాంగ్రెస్ నుంచి ఇరిగెల రాంపుల్లారెడ్డి బరిలోకి దిగారు. 2004 ఎన్నికల్లో గంగుల కుటుంబానికి మద్దుత పలికారు. 2008లో టీడీపీలో చేరి అసెంబ్లకీ పోటీ చేశారు. 2012 ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆపార్టీ అభ్యర్థికి గెలుపునకు సహకరించారు. తాజాగా జనసేనలో చేరారు. అయితే ఆళ్లగడ్డలో గతంలో ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక మరోసారి జనసేన నుంచి టికెట్ ఆశించి, పార్టీలో చేరినట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ అధినేత నుంచి హామీ తీసుకొని పార్టీలో చేరినట్లుగా తెలుస్తున్నది. అయితే జనసేన, టీడీపీ పొత్తు నేపథ్యంలో సీటు ఎవరికి దక్కుతుందో మాత్రం తెలియదు.
ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి టీడీపీలో భూమా ఫ్యామిలీ ఉంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొంతకాలంగా ఆమెపై వస్తున్న ఆరోపణలు పార్టీకి కొంత నష్టం కలిగించినట్లు సమాచారం. అయితే భూమి ఫ్యామిలిని కాదని జనసేనకు ఈ టికెట్ పార్టీ అధినేత చంద్రబాబు కేటాయిస్తారా అంటే అనుమానంగానే కనిపిస్తున్నది. కానీ జనసేన పట్టుబడితే పరిస్థితి ఎలా ఉంటుందోననేది మాత్రం సంశయంగానే ఉంది. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, అప్పుడే ఒక క్లారిటీ రానుంది.