Venkaiah Naidu comments Viral : ఏపీలో ప్రస్తుత రాజకీయాల జుగుప్సాకరంగా ఉన్నాయని మాజీ ఉపరాష్ర్టపతి అభిప్రాయ పడ్డారు. గుంటూరులో డాక్టర్ కాసరనేని సదావివరావు శత జయంతి వేడుకల్లో మాట్లాడిన ఆయన దేశ, రాష్ర్ట రాజకీయాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలపైన కూడా ఆయన స్పందించారు. కొందరు నాయకులు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుపడేలా చేస్తున్నదన్నారు.
ఇక ప్రస్తుత రాజకీయాల్లో విలువలు తగ్గాయని, నాయకుల తీరు ఏమాత్రం బాగా లేదని విమర్శించారు. తప్పుడు భాష మాట్లాడే నాయకులను ఎన్నికల్లో ఓడించాలి. కులం, మతం, నేర మనస్తత్వం, డబ్బు ఎక్కువ కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. చట్ట సభల్లోనే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని చెప్పుకొచ్చారు. నాయకులు స్థాయికి తగ్గట్లు మాట్లాడాలి. ఇలాంటివేమి జరగడం లేదు. ముఖ్యంగా విద్యావేత్తలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. గుణవంతులను గెలిపిస్తేనే రాష్ర్టానికి, ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇక చేపలు పట్టివ్వడం కాదు.. వాటిని ఎలా పట్టుకొని తినాలో తెలిసిననాడే తన ఆకలికి అన్నం ఎలా సంపాదించుకోవాలని అతడికి తెలిసే అవకాశం దక్కుతుంది, ఇలా ఉచితాలతో నాశనం చేయొద్దు అంటూ వెంకయ్య వ్యాఖ్యానించారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వెంకయ్య వ్యాఖ్యలు వైసీపీ నేతలను ఉద్దేశించే అనే అభిప్రాయం వినిపిస్తున్నది. గత కొంత కాలంగా ఏపీలో వ్యక్తిగత దూషణలు పెరిగిపోవడంపై మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై ఏకంగా మాజీ ఉపరాష్ర్టపతి వెంకయ్యానాయుడు కూడా స్పందించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాని, క్రిమినల్ మైండ్, డబ్బు ఉందనే మదంతో అవకాశవాద రాజకీయాలు చేసే నేతలను కాదని సూచించారు.