Hyderabad prix : హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ (ఈ-ప్రిక్స్) రద్దయిన వార్త దావానంలా వ్యాపించింది. ఫార్ములా ఈ రేసును గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకురాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇది రద్దయింది. ఫార్ములా ఈ తన ఈ రేస్ ను హైదరాబాద్ లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
2023, అక్టోబర్ 30న కుదుర్చుకున్న ఆతిథ్య నగర ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ (ఎంఏయూడీ) రద్దు చేసుకుంది. దీంతో ఈ-రేస్ ఒప్పందం ఉల్లంఘనల నేపథ్యంలో నిర్వహణ సంస్థ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిమరీ విరమించుకుంది. అయితే దీనిపై గత ఐటీ మినిస్టర్, ప్రస్తుత ఎమ్మె్ల్యే కేటీఆర్ స్పందించారు.
‘ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న పనికిరాని, తిరోగమన నిర్ణయం. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రపంచ వ్యాప్తంగా మన నగరం, తమన దేశం యొక్క బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఫార్ములా ఈ-ప్రిక్స్ ను మొదటిసారి దేశానికి తీసుకురావడానికి మా ప్రభుత్వ హయాంలో చాలా శ్రమించాం, సమయం తీసుకున్నాం.
సస్టెయినబిలిటీకి కేంద్ర బిందువుగా, బజ్ వర్డ్ గా మారిన ఈ ప్రపంచంలో, హైదరాబాద్ ను ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా చూపించడానికి ఎలక్ట్రిక్ వాహనాల ఔత్సాహికులు, తయారీదారులు మరియు స్టార్టప్ లను ఆకర్షించే వారం రోజుల ఈవీ సమ్మిట్ ను కూడా నిర్వహించడానికి ఫార్ములా ఈ రేస్ ను ఒక సందర్భంగా ఉపయోగించడానికి కేసీఆర్ ప్రభుత్వం చొరవ తీసుకుంది. సస్టెయినబుల్ మొబిలిటీ సొల్యూషన్స్ కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి తెలంగాణ మొబిలిటీ వ్యాలీని కూడా ప్రారంభించాం.’ అని కేటీఆర్ అన్నారు.