Chandrababu Interrogation Room : టీడీపీ అధినేత చంద్రబాబును శనివారం ఉదయం ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో అదుపులోకి తీసుకున్న పోలీసులు సాయంత్రానికి విజయవాడ తరలించారు. విజయవాడ సిట్ కార్యాలయంలో చంద్రబాబును ఆరు గంటల పాటు విచారించారు. ఎన్ఎస్జీ కమాండో పర్యవేక్షణలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. పలు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. అయితే చంద్రబాబు విచారణ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయంలో పోలీసుల అత్యుత్సాహం విమర్శలకు తావిచ్చింది. దీంతో పాటు మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబు పట్ల సీఐడీ వ్యవహారశైలి పై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. అయితే విచారణ సందర్భంగా కేవలం ఉన్నతాధికారులకు మాత్రమే అనుమతి ఉంటుంది. చంద్రబాబు తరఫున న్యాయవాదులను కూడా అనుమతించని సీఐడీ కేవలం సాక్షి మీడియా ప్రతినిధులను అనుమతించడం విమర్శలకు తావిచ్చింది.
ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అనే టీడీపీ ఆరోపణలను నిజం చేస్తూ సాక్షి ప్రతినిధులను మాత్రమే విచారణ సందర్భంగా అనుమతినిచ్చారు. సాక్షి పత్రిక ఫొటోగ్రాఫర్ ఎస్ లక్ష్మీపవన్, సాక్షి టీవీ చానల్ కెమెరామన్ సత్య ఈ విచారణ గదిలో ఉన్నారు. విచారణ సమయంలో సాక్షి ప్రతినిధులకు అక్కడ పనేంటని, వారిని సీఐడీలో చేర్చుకున్నారా అంటూ పలువురు ప్రశ్నించారు. సీఐడీలో కూడా వలంటీర్లను పెట్టారా.. అంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. ఔట్ సోర్సింగ్ సీఐడీ అధికారులు కావొచ్చు అంటూ మరికొందరు విమర్శలు చేస్తున్నారు.
దీనిపై టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నది. సాక్షి మీడియా ను సీఐడీ ఎలా అనుమతినిచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఏపీ సీఐడీ వైసీపీ చేతిలో కీలుబొమ్మలా ప్రవర్తిస్తున్నదని ఆరోపణల నేపథ్యంలో దీనిని నిజం చేస్తూ సాక్షి మీడియాను విచారణ గదిలోకి అనుమతించడం మరింత వివాదానికి కారణమవుతున్నది. ఏదేమైనా ఆది నుంచి ఏపీ సీఐడీ తీరును టీడీపీ ఎండగడుతూనే ఉన్నది.