తెలంగాణలో రాజకీయాన్ని, ప్రజల మనసును సీఎం కేసీఆర్ కు మించి మరెవరూ అర్థం చేసుకోలేరు. ఉద్యమ సమయంలో, ప్రస్తుత రాష్ర్ట రాజకీయాల్లో ఆయనకు మించిన చతురత కలిగిన నాయకుడు మరెవరూ లేరు. రాష్ర్ట రాజకీయాల్లో ఆయనకు మించిన నేత మరెవరూ లేరనడానికి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల్లో లేరు. సీఎం కేసీఆర్ ను ఢీకొట్టాలంటే ఇప్పుడు అంతకు మించి ప్రజలకు దగ్గరైన వ్యక్తి రావాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి అలాంటి రాజకీయ నేతలు మన రాజకీయాల్లో ఉన్నారా అంటే శూన్యంగానే ఆ స్పేస్ కనిపిస్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా.. సంక్షేమ పథకాల ద్వారా సీఎం కేసీఆర్ ప్రజలకు దగ్గరయ్యారు. ప్రస్తుతం దశాబ్ది ఉత్సవాల వేళ ఆయన ప్రభుత్వం ద్వారా వేడుకలు నిర్వహిస్తూనే పార్టీకి ప్రచారం కల్పించుకుంటున్నారు. మరోసారి తన శైలిలో పథకాలను ప్రవేశపెడుతూ ఇక హ్యాట్రిక్ వైపు అడుగులు వేస్తున్నారు. అధికారమే లక్ష్యంగా ఆయన కొట్టే ఒక్కో దెబ్బకు ప్రతిపక్షాలు కుదేలవుతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా జాతీయ అవసరాల రీత్యా ప్రస్తుతం సైలెంట్ అయ్యిందన్న కథనాలు కూడా వస్తున్నాయి. కర్ణాటక ఎలక్షన్ తర్వాత సీఎం కేసీఆర్ మరింత జాగ్రత్త పడ్డారు. నాలుగేండ్లుగా కొన్ని పథకాలకు పైసలు విదిలించని సీఎం కేసీఆర్ ఇప్పుడు ఒక్కసారిగా జులు విదిల్చారు.
మరోవైపు బీఆర్ఎస్ కీలకనేతలు హరీశ్ రావు, కేటీఆర్, కవితలు విడివిడిగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలవడానికి ముందే ఏదో ఒక పథకం ద్వారా ప్రతి ఇంటిని తట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దివ్యాంగుల పింఛన్, గొర్రెల పంపిణీ పథకం, బీసీలకు ఆర్థిక సాయం లాంటి పథకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రానున్న ఐదునెలల్లో మరికొన్ని పథకాలతో బీఆర్ఎస్ ఎన్నికల వేడిని మరింత పెంచనుంది. ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ప్రచారం ఇలా కానిచ్చేస్తున్న ప్రతిపక్షాలు చూసి, ప్రేక్షక పాత్ర వహించడం తప్ప ఏం చేయలేక పోతున్నాయి. తమదైన శైలిలో విరుచుకుపడే అవకాశం వారికి దక్కడం లేదు. బీజేపీ సంగతి అటుంచితే కొంత క్యాడర్ బలమున్న కాంగ్రెస్ కూడా సీనియర్ల మధ్య విబేధాలతో తన్నుకుచస్తున్నది. ధరణిని రద్దు చేద్దామన్న కాంగ్రెస్ ను బంగాళఖాతంలో కలిపేద్దామని కేసీఆర్ పదే పదే బహిరంగ సభల్లో టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఆస్థాయిలో కౌంటర్ మాత్రం రావడం లేదు. కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ లాంటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొంత కాలంగా సైలెంట్ అయ్యారు. దీనికి కారణం పార్టీలో ఉన్న కొందరు నేతల కారణమని అందరికీ తెలిసిందే. మరి ఇక ముందు కూడా ఇలాగే ఉంటే కాంగ్రెస్ పట్టు కోల్పోవడం ఖాయమవుతుంది. రానున్న రోజులు ఆ పార్టీ కి ఎంతో కీలకం. తెలంగాణలో పాగా వేయాలంటే కలిసికట్టుగా నాయకగణమంతా కలిసికట్టుగా ఉంటేనే సాధ్యం. నేను సీఎం.. అంటూ గొప్పలకు పోయి వీళ్లకు వీళ్లు కొట్టుకుంటూ పోతే అది బీఆర్ఎస్ కు వెయ్యి ఏనుగుల బలమవుతుంది. ఇక ఈసారి ఓడిపోతే కాంగ్రెస్ రాష్ర్టంలో తుడిచిపెట్టుకుపోవడం ఖాయమవుతుంది. ఈ తరుణంలో అధిష్టానమే స్వయంగా రంగంలోకి దిగితే బాగుంటుందనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఇప్పటికే ప్రియాంక, రాహుల్, ఖర్గే స్వయంగా తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఈసారి మధ్య ప్రదేశ్, తెలంగాణ పీఠాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకే వ్యూహకర్త సునీల్ కనుగోలు టీంను కర్ణాటకలోలాగే రంగంలోకి దించారు. మరి బీఆర్ఎస్ ను వీరు కట్టడి చేస్తారా,.. కేసీఆర్ చరిష్మా ముందు సాగిలపడుతారో చూడాలి.
ReplyForward
|