Nara Bhuvaneswari Challenge :
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగించేందుకు సిద్దమవుతున్నాడు. తన తండ్రి, పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత యువగళం పాదయాత్రకు ఆయన బ్రేక్ వేశారు. ఆ తర్వాత విజయవాడ చేరుకున్నారు. చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించిన తర్వాత లోకేశ్ జాతీయ పార్టీ నాయకులతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్కడ న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. చంద్రబాబుకు బెయిల్ ఇప్పంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ మీడియాతో మాట్లాడారు. పలువురు నాయకులను కలిసి ఏపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. రాష్ర్టపతి ద్రౌపది ముర్ముకు కూడా చెప్పుకొచ్చారు.
ఇక ఆయన యువగళం పాదయాత్రను కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ లోకేశ్ పై కూడా కేసులు నమోదు చేసింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ తోపాటు పలు కేసుల్లో నిందితుడిగా చేర్చింది. ఇక లోకేశ్ అరెస్టు కూడా ఖాయమని వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్ర కొనసాగుతుందా.. లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే టీడీపీ నేతలు మాత్రం యువగళం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా, పాదయాత్ర ఆపేది లేదని లోకేశ్ చెబుతున్నారు.
అయితే తాజాగా యువగళం పాదయాత్రపై నారా భువనేశ్వరి స్పందించారు. లోకేశ్ ను అరెస్ట్ చేస్తే పాదయాత్ర ఆగదని, మరొకరు ఆ యాత్రను కొనసాగిస్తారని చెప్పుకొచ్చారు. ఇక నారా బ్రాహ్మణి ఆ యాత్ర కొనసాగిస్తుందని అంతా అనుకుంటున్న నేపథ్యంలో భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం తమ కుటుంబాన్ని కుట్రపూరితంగా ఇబ్బంది పెడుతున్నదని, ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు.