Nava Sakam Begins : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ‘నవశకం’ భారీ బహిరంగ సభకు లక్షలాదిగా కార్యకర్తలు తరలివచ్చారు. లోకేష్ యువగళం పాదయాత్ర 226 రోజులు, 97 నియోజకవర్గాల గుండా మొత్తం 3,132 కి.మీ. నడిచారు. ఈ నేపథ్యంలో విజయోత్సవ సభను విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో ఏర్పాటు చేశారు.
సభా ప్రాంగణానికి టీడీపీ అధినేత చంద్రబాబు, బాలయ్య, లోకేష్, పవన్ చేరుకున్నారు. వారికి టీడీపీ, జనసేన శ్రేణఉలు ఘనంగా స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు. వారిలో సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఏపీ చరిత్రో కనివిని ఎరుగని రీతిలో యువగళం-నవశకం సభ జరుగుతోందని చెప్పారు. యువగళం పాదయాత్ర అవినీతి పాలకుల గుండెల్లో సింహస్వప్నంలా మారిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన విజయం సాధించబోతున్నాయని, అందుకు తరలివచ్చిన ఈ జనమే నిదర్శనమన్నారు.
ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ఉత్సాహంతో ఉద్యమిస్తూ ముందుకు సాగుతోందన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు మరో వంద రోజులు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని, వచ్చేది మన ప్రభుత్వమేనని చెప్పారు. త్వరలో యువతకు ఉపాధి, రైతులను రారాజులను చేయబోతున్నామన్నారు. వంద రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శనిని వదిలించుకోబోతున్నామని చెప్పారు.
పితాని సత్యనారాయణ మాట్లాడుతూ.. యువగళం పేరుతో లోకేష్ జైత్రయాత్ర సాగిందన్నారు. అవినీతి పాలకులకు దడపుట్టించారన్నారు. పోలిపల్లి సభతో సైకో సర్కార్ కు ఇక అంతిమ ఘడియలు మొదలయ్యాయన్నారు. జగన్ పాలనలో శాండ్, లిక్కర్, ల్యాండ్, మైన్ మాఫియా పేట్రేగిపోయిందన్నారు.
కాగా, విజయోత్సవ సభ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. డీజే చప్పుళ్లు, బెలూన్లు, నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తిపోతోంది. ప్రాంగణంలో ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, బాలయ్య, పవన్ భారీ కటౌట్లు పెట్టారు.
విజయోత్సవ సభకు రాయలసీమ, ఉత్తర కోస్తా నుంచి విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు విజయనగరం చేరుకున్నాయి. సభకు వస్తున్న ఇరు పార్టీల నేతలకు విజయనగరం నేతల సాదరంగా స్వాగతం పలుకుతున్నారు.
2014తర్వాత చంద్రబాబు, పవన్ కలిసి ఒకే వేదిక మీదకు రావడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్ర, జాతీయ మీడియా కూడా ఈ సభపై ప్రత్యేక కవరేజీ ఇస్తోంది.