Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా సైబర్ కేటుగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా సీబీఐ పేరుతో ఓ రిటైర్డు ఉద్యోగిని మోసం చేసి రూ. 35 లక్షలు కొట్టేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయ వెలుగులోకి వచ్చింది. ఓ రోజు రిటైర్డు ఉద్యోగి (65)కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీ ఆధార్ కార్డు లింక్ ఉన్న ఫోన్ నంబర్ పై అక్రమ ప్రకటనలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఐపీసీ 67ఏ, 354ఏ, 499, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు హెచ్చరించారు. అయితే తనకు దొంగ ప్రకటనలకు ఎలాంటి సంబంధం లేదని వృద్ధుడు వారికి వివరించగా అతను ఫోన్ కట్ చేశాడు.
అనంతరం మూడు రోజుల తర్వాత అదే వృద్ధుడికి నకిలీ సీబీఐ ప్రొఫైల్ నుంచి స్కైప్ వీడియో కాలు వచ్చింది. అతనిపై సీబీఐ కేసు నమోదు చేసిందని, కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. అది నిజంగానే నమ్మిన బాధితుడు వారు అడిగిన వివరాలను చెప్పేశాడు. బ్యాంక్ వివరాలు అడిగారు. విచారణ పూర్తయ్యేంత వరకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్ల్ోనే ఉండాలని కేటుగాళ్లు హెచ్చరించారు. మరుసటి రోజు బాధితుడిని రూ. 34 లక్షలు డిపాజిట్ గా బదిలీ చేయాలని, విచారణ పూర్తయిన తర్వాత డబ్బు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. దీంతో బాధితుడు డబ్బు పంపాడు. ఆ తర్వాత మళ్లీ డబ్బు కావాలని ఒత్తిడి చేయడంతో నగలు అమ్మి ఇచ్చాడు. చివరికి ఇది మోసం అని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు.