Etela Rajender : కరీంనగర్ పార్లమెంట్ స్థానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. ఇన్నాళ్లు బండి సంజయ్ ఒక్కరే ఇక్కడ నుంచి పోటీలో నిలుస్తారని భావించారు. ఇప్పుడు హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం ఇక్కడ నుంచి పోటీకి సిద్ధమే అని ప్రకటించడంతో కొత్త చర్చకు ఆస్కారం ఏర్పడింది. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి సై అని చెప్పడంతో టికెట్ విషయంలో తర్జనభర్జనలు ఏర్పడుతున్నాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈసారి సిట్టింగులకే ప్రాధాన్యం ఇచ్చిన క్రమంలో ఈటల రాజేందర్ కు టికెట్ ఇవ్వడం కష్టమే అని తెలుస్తోంది. ఇన్నాళ్లు తాను మెదక్ నుంచి పోటీలో ఉంటానని అనుకున్న ఈటల ఒక్కసారిగా మాట మార్చడంతో బండి సంజయ్ వర్గంలో ఆందోళన మొదలవుతోంది. పార్టీ కోసం కష్టపడిన సంజయ్ కే టికెట్ ఉంటుందని అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
అధిష్టానం ఆదేశిస్తే కరీంనగర్ నుంచి బరిలో నిలుస్తానని ఈటల చెబుతున్నారు. తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది కరీంనగరే అని అంటున్నారు. ఈనేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఎవరి కోరికను మన్నిస్తుందో తెలియడం లేదు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ రంగంలో ఉంటేనే గెలుపు సునాయాసంగా ఉంటుంది. ఈటలకు టకెటిస్తే గెలుపు అంత సులభం కాదనే అభిప్రాయాలు వస్తున్నాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చడంతోనే బీజేపీకి అధికారం దక్కకుండా పోయింది. దాని అధికారాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. నోముకున్నోడి బూరె నోచుకున్నోడు తిన్నట్లు బీజేపీకి రావాల్సిన అవకాశాన్ని కాంగ్రెస్ ఎగరేసుకుపోయింది. దీనికి కారణం బీజేపీనే. అధిష్టానం అనవసరంగా సంజయ్ ని అధ్యక్షుడిగా మార్చడం విమర్శలకు తావిచ్చింది.