కెనడాలో ఇద్దరు భారతీయ విద్యార్థుల మరణం మిస్టీరియస్ గా మారింది. గతంలో ఒక విద్యార్థి మృతదేహం కనిపించగా.. ఇప్పుడు మరో విద్యార్థి మృతదేహం కనిపించింది. మృతికి గల కారణాలు తెలియకపోవడంతో చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు బంధువులు తెలిపిన వివరాలను బట్టి..
గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ కు చెందిన ఆయుష్ (23 సంవత్సరాలు) కెనడాలోని టొరంటోలో చదువుకుంటున్నారు. గుజరాత్ పోలీస్ శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న రమేశ్ డంఖారా కొడుకు ఆయుష్. చదువు కోసం కెనడా వెళ్లిన ఆయుష్ టొరంటోలోని లారెన్స్ అవెన్యూ వెస్ట్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 6న బయటకు వెళ్లిన ఆయన తిరిగి రూమ్ కు రాలేదు. పలుమార్లు ఫోన్ లో సంప్రదించినా.. వెతికినా ఆచూకీ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అక్కడి ఆయుష్ ఫ్రెండ్స్ చెప్పారు. టొరంటో పోలీసులు మే 7న వంతెన కింద ఒక అనుమానాస్పదంగా మృతదేహాన్ని కనుగొన్నారు. విచారించగా ఆయుష్ మృతదేహంగా నిర్ధారణ అయ్యింది.
ఫార్మాలిటీస్ పూర్తి చేసి అంతిమ సంస్కారాల కోసం మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఆయుష్ తండ్రి రమేశ్ కెనడా వెళ్లారు. ఆయుష్ మృతదేహంతో శనివారం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా నెల రోజుల వ్యవధిలో ఇది రెండో అనుమానాస్పద మృతి. ఇద్దరూ గుజరాత్ కు చెందిన వారు కావడం గమనార్హం. గతంలో హర్ష్ పటేల్ అనే వ్యక్తి కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇద్దరూ యార్క్ యూనివర్శిటీలో, ఆయుష్ ఇంజినీరింగ్ లో, హర్ష్ మేనేజ్మెంట్ స్టడీస్ లో చదువుతుండేవారు. ఈ ఇద్దరి మృతిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. వీరిద్దరూ ఒక రోజుకు పైగా కనిపించకుండా పోవడం, వారి ఫోన్లు చుట్టుపక్కల లేకపోవడం, ఇద్దరి మృతదేహాలు చెరువులోనే కనిపించడం. హర్ష్ పటేల్ చివరి రోజుకు సంబంధించి చెప్పుకోదగ్గ వివరాలేవీ బయటకు రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు కేసును క్లోజ్ చేయాలని కోరుతున్నారు.