Canada : ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత నెలకొన్న దౌత్యపరమైన విభేదాల నేపథ్యంలో కెనడా ప్రధాని ట్రూడో భారతీయ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్లను గణనీయంగా తగ్గించాడు. 2023, డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 14,910 పర్మిట్లను మాత్రమే జారీ చేసింది ట్రూడో ప్రభుత్వం. గతంలో ఆ సంఖ్య 1,08,940గా ఉండేది. అంటే 86 శాతం మేర తగ్గుదల నమోదైంది.
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత ఏజెంట్ల పనే అని ట్రూడో నిరాధారమైన ఆరోపణలు చేశాడు. అయితే వాటిని భారత్ కూడా అదే విధంగా తిప్పికొట్టింది. ఎలాంటి సాక్షాలు లేకుండా ఆరోపణలు చేస్తే మంచిది కాదని హెచ్చరించింది. ఇటీవల జరిగిన G20 సమ్మిట్ లో రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలు బయటకు పొక్కకుండా భారత్ జాగ్రత్త పడింది. కానీ ట్రూడో అతితో సమావేశాలు ముగిసిన తర్వాత ఇద్దరి వ్యవహారం బయటపడింది. ఢిల్లీలోని వారి రాయబారులను తగ్గించుకోవాలని భారత్ కెనడాకు సూచించింది. దీంతో కెనెడా ప్రభుత్వం కూడా 41 మంది దౌత్య అధికారులను వెనక్కి పిలిపించుకుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో స్టడీ పర్మిట్లను ప్రాసెస్ చేయడం కుదరదని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ మార్క్ మిల్లర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సమీప భవిష్యత్ లో కూడా పర్మిట్ల జారీ పెరిగే సంకేతాలు కనిపించడం లేదని పేర్కొన్నారు.
విద్య కోసం కెనడాకు వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయ విద్యార్థులదే సింహభాగం. 2022లో ఆ దేశం 2,25,835 స్టడీ పర్మిట్లు జారీ చేయగా.. అందులో 41 శాతం భారతీయ విద్యార్థులే ఉన్నారు. అక్కడి యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థులే ప్రధాన ఆదాయ వనరు. మరో వైపు విదేశీ విద్యార్థుల వలసలు పెరిగాయని.. దీంతో కెనడాలో నిరుద్యోగం, ఇళ్ల కొరత సమస్యలు ఏర్పడుతున్నాయని మిల్లర్ ఓ సందర్భంలో అన్నారు. ఈ నేపథ్యంలో తమ దేశంలోని విదేశీ విద్యార్థులపై కూడా పరిమితి విధించే యోచనలో ఉన్నామని ముల్లర్ తెలిపారు. ఈ పరిస్థితుల దృష్ట్యా భారత విద్యార్థులు కెనెడాకు వెళ్లేందుకు ససేమీరా అంటున్నారు. మరో దేశం వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారే తప్ప కెనడాకు వెళ్లడం లేదు.