అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికాలోని చికాగో శివారులోని మూడు ప్రదేశాల్లో ఓ వ్యక్తి ఆదివారం, సోమవారం కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఏకంగా 8 మంది చనిపోయారు. నిందితుడు జోలియట్, విల్ కౌంటీ నగరాల్లో కాల్పులకు తెగబడ్డాడు. కాల్పులు జరిపిన నిందితుడికి బాధితులు అంతకుముందే తెలుసని పోలీసులు తెలిపారు. ఈ హత్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. హత్యకు గురైన వారిలో ఒకరి మృతదేహం విల్ కౌంటీలోని ఒక ఇంట్లో ఆదివారం లభించింది.
జోలియట్లోని రెండు ఇళ్లలో మిగతా 7 మృతదేహాలు సోమవారం లభించాయి. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫ్యుజిటివ్ టాస్క్ ఫోర్స్ అనుమానితుడిని పట్టుకునేందుకు పోలీసులకు సహాయం చేస్తోందని జోలియట్ పోలీస్ చీఫ్ విలియం ఎవాన్స్ తెలిపారు.కాగా నిందితుడిని పోలీసులు రోమియో నాన్స్గా గుర్తించారు. ప్రస్తుతం రోమియో నాన్స్ మారణాయుధాలతో ఎరుపురంగు టయోటా కారులో తిరుగుతున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. నిందితుడు కారులో తిరుగుతున్న చిత్రాలను విల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అతడి గురించి ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే తెలియజేయాలని కోరుతున్నారు.