Kamma Mahasabha : తొలి ప్రపంచ కమ్మ మహాసభలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదిక కానుంది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 20-21 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభలు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ లో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు జెట్టి కుసుమకుమార్ ప్రకటించారు. ఈ సభల ద్వారా కమ్మ సామాజిక వర్గాన్ని ఒకే వేదిక మీదకు తీసుకురావడం దీని ఉద్దేశం..విశేష సేవలందించిన వారికి గుర్తింపు ఇవ్వడంతో పాటు ఇతర వర్గీయులకు చేయూతనిచ్చేలా చేస్తారు. కమ్మ సామాజిక వర్గీయుల ఐక్యత… అభివృద్ధి.. భవిష్యత్ లక్ష్యాల సాధనకు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు.
ఈ సంస్థ జెట్టి కుసుమకుమార్ నాయకత్వంలో ఏర్పాటు అయింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా తొలి ప్రపంచ కమ్మ మహాసభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు. మహాసభలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు తరలి రానున్నారు. ప్రధానంగా ఈ మహాసభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరుకానున్నారని కుసుమ కుమార్ వెల్లడించారు.
దేశజనాభాలో 1.5శాతంగా, ప్రపంచవ్యాప్తంగా 2.1కోట్ల మంది కమ్మ సామాజిక వర్గీయులు ఉన్నారని తెలిపారు. వీరిని ఒకే వేదికపైకి తీసుకురావడం, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి నైపుణ్యాభివృద్ధి, రైతులకు ఆసరా, సభల నిర్వహణ, ఇతర సామాజిక వర్గీయులకు చేయూతనందించడం, విశేష సేవలందించిన వారికి సత్కరించడం వంటి లక్ష్యాలతో తమ సంస్థ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ పనిచేస్తుందని కుసుమకుమార్ చెప్పారు. ఈ సభల్లో భవిష్యత్ లక్ష్యాలను ఖరారు చేయటంతో పాటుగా…అతిథుల సూర్పిదాయక ప్రసంగాలు ఉంటాయన్నారు. ఈ తొలి మహాసభలో కమ్మ కుటుంబాల సమాచార బదిలీ, వెనుకబడిన కుటుంబాలకు చేయూతనందించనున్నట్లు వెల్లడించారు.
అదే విధంగా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాల నిర్వహణ, విశిష్ట వ్యక్తుల గుర్తింపు ఇచ్చేలా కార్యక్రమాలు కొనసాగుతాయంటూ చెప్పుకొచ్చారు. భవిష్యత్ ను తీర్చి దిద్దేలా రాజకీయ సాధికారత, యువతకు చేయూత, ఉద్యోగవకాశాల్లో పెద్దపీట వేయడం, వ్యవసాయానికి తోడ్పాటు, పెట్టుబడులు, వంటివాటిపై చర్చిస్తారన్నారు కుసుమ కుమార్.