Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువులకు దక్షిణగా బహుమతులు అందజేయడం అందరికీ తెలిసిందే.. అయితే ఓ గురువుకు శిష్యులు ఏకంగా రూ. లక్షలు విలువచేసే కారును బహుమతిగా అందజేశారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో బండి జేమ్స్ డ్రాయింగ్ ఉపాధ్యాయుడు. గతంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి నవోదయ, నెల్లూరు జిల్లా నవోదయలో బోధించారు. మద్దిరాల నవోదయలో 2016 నుంచి పనిచేస్తున్నారు. ఏప్రిల్ 30న రిటైర్ కానున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు జేమ్స్ ను సత్కరించి గురుదక్షిణ ఇవ్వాలని లేపాక్షి నవోదయ పూర్వ విద్యార్థులు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో ఆదివారం మద్దిరాల నవోదయలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయుడు జేమ్స్ దంపతులను సన్మానించి.. రూ. 12 లక్షల కారును బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నరసింహారావు, అధ్యాపకులు ఆదినారాయణ, లేపాక్షి పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వేమనారాయణ, సంయుక్త కార్యదర్శి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.