వైకుంఠ ఏకాదశి సందర్బంగా అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్బర్గ్లో వెలసిన శ్రీ వెంకటేశ్వ రస్వామి దేవాలయంకు భక్తులు పోటెత్తారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో వేద మంత్ర పఠనం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిం చారు. భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని పునీతులౌతున్నారు.
ఈ సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణతో దేవస్థాన ప్రాంగణం ప్రతిధ్వనించింది. వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి అర్చక స్వాములు వివరించారు. ఈ సందర్భంగా ఆలయంలో అఖండ పారాయణం, అష్టోత్తర శతనామ అర్చనలు, శ్రీ వైకుంఠ గద్యం, అష్టాక్షరీ మహామంత్ర జపాలు నిర్వహించినట్లు వివరించారు. తిరుపతి వెళ్లలేని భక్తులు అమెరికాలో తొలి దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన పిట్స్బర్గ్లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని శ్రీవారి కృపకు పాత్రులు అవుతున్నారని వారు తెలిపారు.