Janasena : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మాట్లాడిన నాయకులు కేటాయింపు సంతృప్తి కరంగా లేదని చెప్తున్నారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 సీట్లను కేటాయించారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా ఒకే చెప్పాడు. ఇందులో కూడా కేవలం ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తను ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్నది కూడా ప్రకటించలేదు.
అయితే, జనసేనకు ఇంత తక్కువ సీట్ల కేటాయింపుపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ రోజు (ఫిబ్రవరి 25) జనసేన అధికార ప్రతినిధి బోలిశెట్టి సత్యనారాయణ టికెట్ల కేటాయింపుపై స్పందించారు. ఈ పంపకంతో ఎవరికి లాభం అంటూ ప్రశ్నించారు. కూటమిలో జనసేనకు 40కి తగ్గకుండా సీట్లను కేటాయించాలని కోరారు. ఇలా కేటాయించకపోతే ప్రధాన ఉద్దేశ్యమైన ఓట్ల బదలాయింపు జరగదన్నారు.
ఇక మధ్యాహ్నం ఏపీ కాపు సంఘం నేత, మాజీ మంత్రి హరిరామ జోగయ్య పొత్తుపై పెదవి విరిచారు. ‘ఒకరు ఇవ్వడం మరొకరు దేహీ అనడం పొత్తు ధర్మం అనిపించుకోదు. జనసేన 24 సీట్లకు మించి నెగ్గగలిగే స్థోమత లేదా..? అంటూ నిలదీశారు. జనసేన పరిస్థితి మరీ ఇంత హీనంగా ఉందా..? ఈ పంపకం ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాల కోసమేనని పవన్ కళ్యాణ్ చెప్పగలరా..? అంటూ ప్రశ్నించారు.
ఈ మేరకు ఒక లేఖ రిలీజ్ చేశారు. అందులో ‘సీట్ల పంపకం మిత్ర పక్షాల మధ్య ఏ ప్రాతిపదికన కేటాయించారు.? కులాల జనాభా ప్రాతిపదికన జరిగాయా.? అని ప్రశ్నించారు. జనసైనికులు సంతృప్తి చెందేలా కేటాయింపు జరిగిందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన సైనికులకు కావాల్సింది సీట్లు కాదు.. పవన్ పాలన, పవన్ అధికారం చేపట్టడమే కావాలి. సీఎం పదవి సమాన కాలం ఉండాలి. చెరి సగం మంత్రి పదవులు దక్కాలి. ఈ రకంగా వ్యూహాలతో వెళ్తేనే వైసీపీ వెనక్కు తగ్గుతుంది.