RGV Vyooham : రామ్ గోపాల్ వర్మ ఏదీ చేసినా సంచలనమే. ఆయన ట్వీట్ చేస్తే ఎవరికో ఒకరికి గుచ్చుకుంటుంది. ఏదన్నా సినిమా చేస్తే ఏదో వర్గాన్ని టార్గెట్ చేసినట్టే. ప్రతీది కాంట్రావర్సే. వర్మను బతికించేవే వోడ్కా, విమెన్, వివాదాలేనని ఖరాఖండీగా తేల్చేయవచ్చు. ఇక ఆయన గత కొన్నేండ్లుగా పొలిటికల్, అడల్ట్ సినిమాలే చేస్తున్నారు.
రీసెంట్ గా ఏపీ సీఎం జగన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ‘వ్యూహం’.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల ముందు ఈసినిమా రిలీజ్ అవుతుండడంతో పాటు.. అందులోని పాత్రలు..విపక్ష నేతలు చంద్రబాబు, పవన్, నారా లోకేశ్ లను టార్గెట్ చేస్తూ ఉండడంతో వివాదస్పదమైంది. ఇదే అభ్యంతరంతో నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ఎన్నికల వేళ సీఎం జగన్ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాల ఆధారంగా వర్మ తీసిన వ్యూహం చిత్రాన్ని అడ్డుకోవాలని కోరుతూ లోకేశ్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు ఓటీటీల్లో రిలీజ్ చేయకుండా ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టులో సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపినా న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
కాగా, వ్యూహం సినిమాకు గతంలో సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను నిరవధికంగా రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఎక్స్ లో ఓ ట్వీట్ చేశారు. వ్యూహం మూవీ సెన్సార్ సర్టిఫికెట్ కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల సారాంశాన్ని ఆయన ట్వీట్ లో ఒక్క ముక్కలో తేల్చేశారు. ఇందులో వ్యూహం మూవీ సెన్సార్ సర్టిఫికెట్ రద్దు కాలేదని వర్మ తెలిపారు.
వాస్తవానికి సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ ఇవ్వడానికి సంబంధించిన రికార్డులు జనవరి 12 కల్లా సమర్పించాలని మాత్రమే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని వర్మ క్లారిటీ ఇచ్చారు. దీంతో వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ రద్దుపై జరుగుతున్న ప్రచారంపై వర్మ స్పష్టత ఇచ్చినట్లయింది.