CM Jagan bus Yatra :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు (అక్టోబర్ 09) విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వైసీపీ పదాధికారుల సమావేశంలో ఆయన కొన్ని కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఆయనకు పెరుగుతున్న మద్దతు నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు (అక్టోబర్ 09) ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది. వీటితో పాటు ఏపీకి కూడా ఎన్నికలు ఉంటాయని మొదట అంతా భావించారు. కాని అలాజరగలేదు. పదాధికారుల సమావేశంలో సీఎం జగన్ ’సమయానికే ఎన్నికలు జరుగుతాయని ఎలాంటి ముందస్తు ఉండదని’ ప్రకటించారు. దీంతో ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టేట్లు కనిపిస్తుంది.
అయితే గతంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర నిర్వహిస్తే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రెండు పార్టీలు కలిసి పోయి పొత్తు పెట్టుకున్న సందర్భంగా వారి జోరును తట్టుకోవడం ఆశామాషీ కాదు. ఈ నేపథ్యంలో జగన్ ‘బస్సు యాత్ర’ నిర్వహిస్తానని ప్రకటించారు. ఈ నెల 25వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రతీ రోజు మూడు ప్రాంతాల్లో యాత్ర కొనసాగుతుందని చెప్పారు.
పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో సహా పార్టీ కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొననున్నారు. యాత్రలో భాగంగా ఆయా ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలను కూడా నిర్వహించేందుకు స్థానిక నాయకులు సన్నాహాలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తుంది వైసీపీ పార్టీ.