CM Delhi Tour : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు (డిసెంబర్ 26) ఢిల్లీకి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఆయన ప్రధానిని కలిసేందుకు వెళ్తున్నారు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వారి ప్రధానిని కలవడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే ఆయన రేపు (డిసెంబర్ 27) ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలుస్తారు. ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితం ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. అది కన్ఫమ్ కావడంతో ఢిల్లీకి వెళ్లారు.
ప్రధానితో భేటీలో రాష్ట్ర స్థితి, గతులు, ఖర్చులు, కేంద్రం ఇవ్వాల్సిన నిధులు తదితరాల గురించి చర్చించే అవకాశం ఉంది. తెలంగాణకు రావాల్సిన నిధుల్లో ఎన్నో కొన్ని ఇస్తే కాస్త రిలీఫ్ ఉంటుందని సీఎం భావిస్తున్నారు. 14, 15వ ఆర్థిక సంఘాల సిఫారసులతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ఆర్థిక సాయాలు, మిషన్ భగీరథ నిర్వహణకు 15వ ఆర్థిక సంఘం సిఫారసులు, చెరువుల పునరుద్ధరణ కోసం నీతి ఆయోగ్ సూచనలు, స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు అడిగే అవకాశం ఉంది.
అయితే ఈ నిధులను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వాలని కోరింది. అప్పుడు కేంద్రం ఆ నిధులను ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే ప్రస్తుత పరిస్థితులు ప్రధానికి చెప్పి నిధులు విడుదల చేసుకుంటే అది అతి పెద్ద విజయం అయ్యే అవకాశం ఉంది. ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత సీఎం ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాల గురించి పార్టీ పెద్దలకు వివరిస్తారు. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. దీంతో పాటు నామినెటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహంపై ఆయన చర్చించనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.