Team India : టీమిండియాలో ఆడే క్రికెటర్ల ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. కేవలం కొన్ని ప్రాంతాలకే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు చివరి నుంచి ప్రారంభం కానున్న మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎక్కువ మంది ముంబై ఇండియన్స్ ప్లేయర్లు ఉన్నారు. దీంతో మీని ముంబై ఇండియన్స్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ టీమిండియా జట్టులోను తన జట్టుకు చెందిన ప్లేయర్లనే ఎంపిక చేసుకున్నాడనే విమర్శలు వస్తున్నాయి.
అతడు స్వార్థపరుడని కొందరు విమర్శిస్తున్నారు.
భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా ముంబైకి చెందినవాడే కావడంతో ముంబై లాబీయింగ్ బలంగా పని చేసిందని.. అందుకే ముంబై క్రికెటర్లను ఎక్కువ మందిని ఎంపిక చేశారంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టులో ఆరుగురు ముంబై ఆటగాళ్లు, ముగ్గురు గుజరాత్ ప్లేయర్లు ఉన్నారని.. మిగతా దేశంలో క్రికెటర్లెవరూ లేరా అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. ముంబై ఇండియన్స్ లాబీ టీమిండియాను నడుపుతోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ను ఎంపిక చేయకపోవడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రోహిత్ శర్మతోపాటు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడిన విషయం తెలిసిందే. గుజరాత్ మూలాలున్న హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్ కు ఆడాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, బుమ్రా గుజరాత్ ప్లేయర్లు. శార్దుల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్ కూడా ముంబైకి చెందిన ఆటగాళ్లే.. మెగా టోర్నీల్లో సత్తా చాటే శిఖర్ ధావన్కు భారత జట్టులో చోటు కల్పించకపోవడంపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సంజూ శాంసన్కు మరోసారి అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. కేవలం ముంబై, గుజరాతీ క్రికెటర్లకే ప్రాధాన్యం దక్కుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. అయితే ప్లేయర్ల ఎంపిక విషయాన్ని ఇంతటితో వదిలేయాలని మాజీ క్రికెటర్ సునీల్ గవారస్కర్ పేర్కొంటున్నారు.