Antibiotics :
వర్షాకాలంలో అనేక వ్యాధులు వస్తుంటాయి. అతిసార, మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ వంటి రోగాలు బాధిస్తుంటాయి. దీంతో మనం ఆస్పత్రికి వెళ్లి వైద్యుడి సలహాతో యాంటీ బయోటిక్ మందులు వేసుకుంటాం. కానీ కొందరైతే జలుబుకు కూడా మందులు వేసుకుంటారు. ఇది అంత మంచిది కాదు. మందులు ఊరకే వేసుకోకూడదు. భరించలేని నొప్పి ఉంటేనే మందుల జోలికి వెళ్లాలి. దగ్గు, జలుబులకు మాత్రలు వేసుకోవడం అంత సురక్షితం కాదని తెలుసుకోవాలి.
యాంటీ బయోటిక్ మందులు వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన ఆహారం తినాలి. లేదంటే సమస్య తీవ్రమవుతుంది. ఇలాంటి సమయంలో జీర్ణ వ్యవస్థ బలహీనంగా మారుతుంది. మనం తిన్న ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమమని గ్రహించుకోవాలి.
ఈ సమయంలో మజ్జిగ తాగడం మంచిది. దీంతో జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. మజ్జిగలో చిటికెడు ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు గరం మసాలా వేసుకుని తాగితే ప్రతికూల ప్రభావాలు లేకుండా పోతాయి. ఇలా మనం యాంటీ బయోటిక్స్ మందులు వాడే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం.
ఆకలి వేసినప్పుడే తినాలి. మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం కావు. అందుకే సూప్ లు తాగడం మంచిది. దీంతో మనలో జీర్ణక్రియ మెరుగుపడి ఆకలి బాగా వేస్తుంది. వికారం తగ్గుతుంది. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. దీంతో మనం తీసుకున్న ఆహారాలు జీర్ణం అయ్యే అవకాశం ఉంటుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగితే మంచిది.