Eatala VS KCR : టీఆర్ఎస్ ఏర్పడినప్పటి నుంచి ఉన్న నేతల్లో ఈటల రాజేందర్ ఒకరు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర అమోఘమని చెప్పవచ్చు. ఉద్యమ సమయంలో ఏ నిరసనకు పిలుపునిచ్చినా బీసీ వర్గాలను ఒక్కతాటిపైకి తెచ్చి సక్సెస్ చేయడంలో ఆయన పాత్ర అమోఘమని అందరికీ తెలిసిందే. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఆయన పని చేశారు. ఆ తర్వాత 2018లో గెలుపొంది ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. అవినీతికి పాల్పడ్డాడంటూ కేసీఆర్ ప్రభుత్వం మంత్రి పదవిని తొలగించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్ లో బీజేపీ తరుఫున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందాడు. ఇదంతా అందరికీ తెలిసిందే..
అయితే కేసీఆర్ ఎక్కడ నిలబడితే అక్కడి నుంచే తాను పోొటీ చేసి కేసీఆర్ ను ఓడిస్తానని చెప్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో 2023లో కేసీఆర్ నిలబడే గజ్వేల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ప్లాన్ చేస్తున్నాడు. దీనికి బీజేపీ పార్టీ కూడా సమ్మతించినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఆయన నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటు ఇక్కడ కూడా పోటీ చేస్తాడని తెలుస్తోంది. గజ్వేల్ లో ఆయన పోటీ చేస్తే కేసీఆర్ మెజారిటీని భారీగా తగ్గించడమో లేక ఓడించడమో చేస్తే ఆయనపై పైచేయి సాధించిన వాడిని అవుతానని ఈటల అనుకుంటున్నాడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిద్ధిపేట నుంచి పోటీ చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 నుంచి గజ్వేల్ నుంచి బరిలోకి దిగుతున్నారు. మొదటి సారి 20వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించిన ఆయన ఆ తర్వాత వచ్చిన 2018 ఎన్నికల్లో 58 వేలకు పెంచుకున్నాడు. ఈ సారి 2023లో అంతకంటే ఎక్కువ మెజారిటీ సాధించాలని అనుకుంటున్నాడు. అయితే ఈటల రాజేందర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో ప్రస్తుతం కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని బీజేపీ అంటుంది.
ఈటల సామాజికవర్గం అయిన ముదిరాజులను కేసీఆర్ అవమానిస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో గతంలో ముదిరాజ్ మహాసభను పెద్ద ఎత్తున నిర్వహించగా అందులో బీసీ నేతగా ఈటల ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఇక బీఆర్ఎస్ సీట్ల కేటాయింపులో ఒక్క సీటు కూడా ముదిరాజులకు కేటాయించకపోవడంతో మరింత భగ్గుమంటుంది ఆ సామాజికవర్గం. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పటాన్ చెరు నాయకుడు నీలం మధు ముదిరాజ్ కు కూడా ఆయన టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీని వీడాడు.
ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకుంటే గజ్వేల్ లోని ముదిరాజుల ఓట్లను ఏక పక్షంగా ఈటల రాజేందర్ దక్కించుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క ముదిరాజులను బేస్ చేసుకొని బీసీ ఓట్లు మొత్తం టర్న్ అయితే కేసీఆర్ పరిస్థితి ఏంటని కూడా పార్టీ పెద్దలు తర్జన భర్జన అవుతున్నారు. ఇది జరగకుండా చూడాలని అక్కడ ఇన్ చార్జి బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించింది.
ఇప్పటి వరకు రెండు సార్లు దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించగా రెండు చోట్లా పార్టీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గజ్వేల్ లో కూడా ఓటిమి పాలైన సీఎం ప్రతిష్ట పోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.