MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మే 14 వరకు పొడిగించింది. ఇదెలా ఉండగా, లిక్కర్ పాలసీ కేసులో వారంలో కవితపై చార్జిషీటు దాఖలు చేయనున్నట్లు ప్రత్యేక న్యాయస్థానానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. 60 రోజుల్లోగా విధిగా ఈడీ చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంటుంది. బలమైనా కారణాలు ఉంటే.. అదనంగా మరో నెలలోగా చార్జిషీటు దాఖలు చేయవచ్చు. మొత్తం కలిపి 90 రోజుల్లోగా చార్జిషీటు దాఖలు చేయకపోతే, నిందితులకు డిఫాల్ట్ బెయిల్ మంజూరవుతుంది.
ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు మంగళవారం హాజరైన కవిత బంధువులను కలిసేందుకు అనుమతించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు ప్రాంగణంలో ఉన్న సెల్ లో ముగ్గురు బంధువులతో కలిసి భోజనం చేసేందుకు స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా అనుమతించారు. అనంతరం కోర్టు హాల్ నుంచి బయటకు వెళ్లే సమయంలో కవిత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వాళ్లను విడిచిపెట్టి.. దేశం దాటించి.. తనలాంటి వాళ్లను అరెస్ట్ చేశారని.. ఇది అన్యాయం.. దీన్ని అందరు గమనించాలని కవిత కోరారు.