![Mega DSC](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-7-25.jpg)
Mega DSC : ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ పైనే మొదటి సంతకం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ పై సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో విద్యా శాఖ అప్రమత్తమైంది. ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్లో 6,100 పోస్టులు ఉన్నాయి. అయితే తాజాగా 30 వేల ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాష్ట్రంలో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గతేడాది జులైలో లోక్సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2023 జులై 31న లోక్సభలో ఒక ప్రశ్నకు అప్పటి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి సమాధానం ఇచ్చారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు 2022-23లో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 20021-22లో 38,191 ఉపాధ్యాయ పోస్టులు, 2020-21లో 22,609 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.