Gaddar and Revanth deal : క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు మళ్లీ కోపమొచ్చిందని, అంత కోపంలోనూ పాల్ తన మార్కు కామెడీని మిస్ చేయడం లేదంటూ నెటిజన్ల సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. 2019 నుంచి రెండు తెలుగు రాష్ర్టాల్లో కేఏ పాల్ ను పొలిటికల్ కమెడియన్ అంటూ ట్రోల్ అవుతున్నాడు. అయితే పాల్ పొలిటికల్ పరంగా తనదైన శైలిలో పాల్ చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంటాయి. అయితే ఇప్పటి దాకా ఇతర పార్టీలపై కామెంట్లు చేసిన పాల్ ఈ సారి మాత్రం తన పార్టీలోని వారిపై కామెంట్లు చేశాడు. పార్టీ సిద్ధాంతాలు, తన ఆదేశాలను ధిక్కరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశాడు. ఎంతటి వారినైనా బయటకు పంపించేస్తామని తేల్చి చెప్పాడు.
తెలంగాణలో రాబోయే జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి గెలవబోతున్నదని, కాబోయే ముఖ్యమంత్రి తానేనని కేఏ పాల్ చాలా సార్లు ప్రకటించారు. మునుగోడు ఎన్నికల్లోనే తమ పార్టీ సత్తా చూపుతుందన్నాడు. అయితే మునుగోడు ఎన్నికలకు ముందుగా.. ‘ప్రజా యుద్ధ నౌక’గా గుర్తింపు పొందిన విప్లవ గాయకుడు గద్దర్ ను పాల్ తన ప్రజాశాంతి పార్టీలో చేర్చుకున్నారు. మునుగోడు ఉపఎన్నికలో ప్రజాశాంతి పార్టీ తరఫున గద్దర్ పోటీ చేస్తారని ప్రకటించిన పాల్ ఆయనకు బీఫారం ఇస్తున్నట్లు మీడియాకు ఫోటోలు కూడా రిలీజ్ చేశాడు.
కానీ గద్దర్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ ఉప ఎన్నికలో పాల్ నామినేషన్ వేసి, తాను భారీ మెజార్టీతో గెలవబోతున్నానని ప్రకటించాడు. ఎన్నికల ఫలితాల రోజు కూడా తానే గెలుస్తున్నానని ప్రకటించాడు. తీరా ఫలితాలు చూస్తే పాల్ కు 805 ఓట్లు వచ్చాయి. రౌండ్ల వారీగా ఫలితాలు ప్రకటిస్తుండగా పాల్ కు పెద్ద గా ఓట్ల రాకపోతుండగా అతడిని ప్రశ్నించగా మిగతా రౌండ్లలో ట్రెండ్ మారుతుందని, తర్వాత తనకు ఓట్లు వస్తాయంటూ చేసిన కామెంట్లు తెగ ట్రోల్ అయ్యాయి. అప్పటి నుంచి పెద్దగా బయట కనిపించని పాల్ ఇప్పడు మరోసారి కామెడీ బాంబు పేల్చాడంటూ నెట్లో వైరల్ అవుతున్నది.
రేవంత్ రెడ్డితో గద్దర్ డీల్..
కేఏ పాల్ తన ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో గద్దర్, ఆయన కుమారుడు రూ.150 కోట్ల డీల్ కుదుర్చుకుని పోటీ నుంచి తప్పుకున్నారని పాల్ ఆరోపించారు. ఈ విషయాన్ని హైకోర్టు సీనియర్ న్యాయవాది తనతో చెప్పారని పాల్ వెల్లడించారు.
గతంలో ఇదే ఉప ఎన్నికల సమయంలో 1200 వందల మంది అమరవీరుల ప్రతినిధిగా శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి ప్రజాశాంతి పార్టీలో చేరారని పాల్ వ్యాఖ్యానించారు. కానీ అతన్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు. తమను మూడు నెలల పాటు చిత్రహింసలకు గురిచేశారని, పార్టీని వీడేలా చేశారని వారు ఆక్షేపించారు. ప్రజాశాంతి పార్టీపై కుట్ర జరుగుతోందని, ఈ విషయాన్ని బడుగు బలహీన వర్గాల ప్రజలు గమనించాలని కోరారు. 31 లక్షల చురుకైన కార్యకర్తల బలం ఉన్న ప్రజాశాంతి పార్టీని ఏమీ చేయలేక పోయిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు అధికారం దక్కాలంటే ప్రజాశాంతి పార్టీలో చేరాలని పాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే గద్దర్ విషయంలో పాల్ చేసిన కామెంట్లు మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.