Megastar chiranjeevi : హీరోల మధ్య పోటీ ఉన్నట్లే.. వారి వారి ఫ్యాన్స్ మధ్య కూడా పోటీ ఉంటుంది. అయితే అది ఈ మధ్య ఎలా మారిందంటే తమ హీరోను ఎలివేషన్ చేసుకోవడం కంటే.. అవతలి హీరోను డీగ్రేడ్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియా బాగా విస్తరించిన ఈ సమయంలో ఈ దాడి మరింత పెరిగింది. తమ ఆపోజిషన్ హీరో చేసిన సినిమాకు మోస్తరు నెగెటివ్ టాక్ వస్తే చాలు దాన్ని పండగ చేసుకుంటూ.. సోషల్ మీడిలో విపరీతంగా స్ర్పెడ్ చేసి సినిమాను డిజాస్టర్ చేస్తున్నారు.
ఇందులో ఆ హీరో ఫ్యాన్స్, ఈ హీరో ఫ్యాన్స్ అని చెప్పడానికి లేదు. ఇందులో ఒక్కోసారి రాజకీయ శక్తులు కూడా కలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి రీసెంట్ మూవీ ‘భోళా శంకర్’పై వచ్చిన నెగెటివిటీ అలాంటి ఇలాంటిది కాదు. ఈ మూవీ చిరు అభిమానులకే నచ్చలేదన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. కానీ సినిమా రిలీజ్ కు ముందే భారీగా కలెక్షన్లు తగ్గాయి. ఇక యాంటీ ఫ్యాన్స్ దీన్ని ఏ మేరకు టార్గెట్ చేశారో తెలిస్తే ఆశ్చర్యం వేయకమానదు.
‘భోళా శంకర్’ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు. దీనికి సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారమే కారణం. కొన్ని వర్గాలు ఈ సినిమాను పెద్ద ఎత్తున టార్గెట్ చేశాయి. పనిగట్టుకుని మరీ నెగెటివ్ టాక్ను స్ప్రెడ్ చేశాయి. దీనికి కారణం కూడా ఉందట. ‘భోళా శంకర్’ రిలీజ్ కు ముందు ‘వాల్తేరు వీరయ్య’ 200 డేస్ ఫంక్షన్ జరిగింది. ఇందులో చిరు చేసిన వ్యాఖ్యలే కారణంగా భావిస్తున్నారు. ఈ వేడుకలో చిరంజీవి ప్రసంగాన్ని ఆరంభిస్తూనే ‘ఆ రోజుల్లో’ అని చెప్పుకోవడం నాకిష్టముండదు అన్నారు.
అయితే చిరంజీవి ఈ పదం కామన్ గానే అని ఉండవచ్చు. ఆ తర్వాత కూడా తనకు పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి అని కూడా అన్నారు. కానీ ‘ఆ రోజుల్లో’ అనే పదం ఎక్కువగా నందమూరి ఊతపదం. ‘ఆ రోజుల్లో నాన్నగారూ’ అంటూ ఉండేవారు. ఇది నందమూరి ఫ్యాన్స్ కు అఫెండ్ అయినట్లు తెలుస్తోంది. వాళ్లు ‘భోళా శంకర్’ను గట్టిగానే టార్గెట్ చేశారు.
నందమూరి అనుకూల మీడియా, వెబ్ మీడియా కూడా ఈ సినిమాను లక్ష్యంగా చేసుకున్నట్లు కొందరు భావిస్తున్నారు. దీని తర్వాత ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చిరు చేసిన వ్యాఖ్యలు వైసీపీ వాళ్లకు ట్రిగ్గర్ అయ్యాయి. దీంతో వారు కూడా ఈ సినిమాను దారుణంగా టార్గెట్ చేశారు. మామూలుగా సినిమా మీద ఉన్న నెగెటివిటీకి తోడు.. ఈ వర్గాలు ఆ చిత్రాన్ని టార్గెట్ చేయడం వల్లే దారుణమైన ఫలితం వచ్చినట్లుగా భావిస్తున్నారు.