Jagan to Jail : ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరో ఆరు నెలల్లో ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. జనాల్లోకి నేరుగా వెళ్తున్న టీడీపీని ఇబ్బంది పెట్టడానికి ఏపీ ప్రభుత్వం ఆపార్టీ అధినేత చంద్రబాబును వివిధ కేసుల్లో అభియోగాలు మోపుతూ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన 4 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉన్నారు.
ఇక ఈ సారి ఎన్నికల బరిలోకి సంయుక్తంగా వెళ్లేందుకు టీడీపీ, .జనసేన సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రత్యేక కమిటీలు వేశారు. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు టీం, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ టీం సమన్వయం చేసుకోనుంది. ఇక సోమవారం ఈ మేరకు జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మధ్య కీలక భేటీ, తొలి సమావేశం జరగబోతున్నది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది.
అయితే ఈ క్రమంలో తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఏపీలో విద్యాసంస్కరణలు, అమ్మఒడి అంటూ గొప్పలు చెప్పుకుంటున్న పథకాల్లో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ చేపట్టి, జగన్ ను జైల్లో పెడుతామని స్పష్టం చేశారు. పేదలకు విద్య మంచిదే అయినా, వైసీపీ నేతల అవినీతికే ఈ పథకం పెట్టినట్లు కనిపిస్తున్నదని మండిపడ్డారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఎం జగన్ ఇటీవల పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేశాక, పవన్ పెట్టిన తొలి సమావేశం ఇదే. అయితే పవన్ మాత్రం ఎక్కడా వ్యక్తిగత విమర్శలకు పోలేదు. ఇదే వైసీపీకి జనసేనకు ఉన్న తేడా అని శ్రేణులు సంబుర పడుతున్నాయి.
వైసీపీ నాయకులు అవసరమైతే కుటుంబ సభ్యులను కూడా బయటకు లాగడానికి వెనుకాడరని చెబుతున్నారు. ఇక జగన్ కు జైలే అని పవన్ వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ , వైసీపీల మధ్య ఆగాథం మరింత పెరిగింది. ఇక రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ఐదేళ్లలో జరిగిన ప్రతి ఘటనకు బదులు చెప్పుకోవాల్సిందేనని టీడీపీ, జనసేన శ్రేణులు చెబుతున్నాయి.