Janapadula Gandde Chappude Janapadam : అమెరికన్ తెలుగు అసోసియేషన్’ ఇంటర్నెట్ వేదికగా నిర్వహించిన ‘జనపదుల గుండె చప్పుడు జానపదం’కు మంచి స్పందన లభించింది. ఆదివారం (అక్టోబర్ 1) నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రోతల నుంచి విశేష స్పందన లభించింది. సాహిత్య విభాగ అధిపతి, పాలకమండలి సభ్యురాలు సింగిరెడ్డి శారద అధ్యక్షత వహించారు. ‘ఆటా’ సాహిత్య వేదిక సభ్యురాలు మాధవి దాస్యం ప్రసంగించారు. రవి తుపురాని, పంజాల వీరన్న గాయకులుగా సభకు పరిచయం చేశారు.
కార్యక్రమానికి సంచాలకుడిగా వ్యవహరించిన వాగ్భూషణ పురస్కార గ్రహీ, సంస్కృతాంధ్ర పండితుడు నంది శ్రీనివాస్ మాట్లాడారు. యువ కళాకారులను వెలికితీసేందుకు ‘ఆటా’ ఇలాంటి కార్యక్రమాలను రూపొందించడం ఆనందంగా ఉందన్నారు. సంగీతంలోని సప్త స్వరాలను ప్రకృతే అందించిందని, అలాంటి ప్రకృతి జన పదుల గుండెను తాకినప్పుడు ‘జానపదం’ పుట్టిందన్నారు. యువ జానపదా కళాకారులను ఆయన అభినందించారు. నక్క శ్రీకాంత్, బొడ్డు దిలీప్ కుమార్, ముకుందను అభినందనలు తెలిపారు.
ప్రతి భాష, సాహిత్యానికి మూలం జానపద సాహిత్యమని, ఇది మౌఖిక, సదాచార సాహిత్యంగా పల్లెల్లో నేటికీ మిగిలి ఉందని ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని అన్నారు. పొడుపు కథలు, గేయాలు, కళారూపాలుగా, జానపద వాఙ్మయం ఒకరి నుంచి మరొకరికి, ఒక తరం నుంచి మరో తరానికి అందుతున్న వరమన్నారు. చాలా మంది కళాకారులు జానపదాన్ని పల్లెల నుంచి పట్నాలకు తీసుకెళ్లారని వారందరికీ ఆమె ధన్యవాదాలు చెప్పారు. ఇప్పుడు ‘ఆట’ అదే జానపదాన్ని దేశాన్ని కూడా దాటిస్తుందన్నారు. ఈ కర్యక్రమంలో పాల్గొన్న వారికి పేరు పేరునా ఆమె ధన్యవాదాలు చెప్పారు.