Unemployed Youth : తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ , బీజేపీలు క్షేత్ర స్థాయిలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కీలక విషయాలపై రాష్ర్ట వ్యాప్తంగా చర్చ పెడుతున్నది. ఇందులో ముఖ్యంగా నిరుద్యోగుల అంశం. ప్రభుత్వం టీఎస్ పీఎస్సీ ద్వారా వేసిన పలు పరీక్షల్లో అవకతవకలు జరగడం, పేపర్ లీక్ లాంటి ఇష్యూలు బయటకు రావడం ఇలా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నది. పోస్టుల భర్తీ అటుంచితే ఎంతో మంది నిరుద్యోగుల జీవితాల్లో ప్రభుత్వం ఆటలాడిందనే అపవాదును బీఆర్ఎస్ పై కాంగ్రెస్ వేస్తున్నది.
అయితే ఈ నోటిఫికేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు మాత్రం పెద్ద ఎత్తున ఆదాయం వచ్చిందని, నిరుద్యోగులకు ఒరిగిందేమి లేదని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో పలు నోటిఫికేషన్ల ద్వారా ఆదాయం విషయం పై వివరాలు స్పష్టంగా చెబుతున్నది. గ్రూప్ 1 కింద 3.80 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, ఒక్కో అప్లికేషన్ కు రూ. 200 చొప్పున రూ. 76 కోట్లు ఆదాయం సమూరినట్లు పేర్కొంది. ఇలా మొత్తంగా గ్రూప్1, 2, 3, 4 వరకు, కానిస్టేబుల్, గురకులాలు , టీఆర్టీ ద్వారా మొత్తంగా రూ. 229 కోట్లు ఫీజుల రూపంలో వసూలు చేసిందని పేర్కొంది. కానీ ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేకపోయిందని నిరుద్యోగులకు చెబుతున్నది.
అయితే నిరుద్యోగుల ఆశలతో ప్రభుత్వం ఆడుకుందని, నోటిఫికేషన్లు పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని మండిపడింది. ఎన్నికల్లో ఓటు వేసే ముందు నిరుద్యోగులు ఒక్కసారి ఆలోచించుకోవాలని, గత పదేళ్లలో సీఎం కేసీఆర్ సర్కారు నిరుద్యోగులకు చేసిందేమిటో చెప్పాలని కోరుతున్నారు.