KCR Stay in Gajwel : నా ఇల్లు , పొల్లు మొత్తం గజ్వేల్లోనే ఉన్నాయి. హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న గజ్వేల్ను విడిచి కామారెడ్డికి ఎందుకు పోతా అని సీఎం కేసీఆర్ గజ్వేల్ క్యాడర్కు స్పష్టం చేశారు. కామారెడ్డి నుంచి పోటీకి సిద్ధం కావడంతో తమ పరిస్థితి ఏమిటని గజ్వేల్ నేతల్లో అనుమానాలు మొదలయ్యాయి. దీంతో కేసీఆర్ అక్కడి నేతలను ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడారు. ఇక్కడే ఉంటానని వారికి స్పష్టం చేశారు. వచ్చే టర్మ్ లో నెలకో రోజు కచ్చితంగా కేటాయిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఇంకా చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. ఇవన్నీ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. అదే సమయంలో గెలిచినా తాను కామారెడ్డికి పోతానన్న అనుమానాలు పటాపంచలు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.
కామారెడ్డిలో పోటీ చేయడానికి ఓ కారణం ఉందంటున్నారు. కానీ అక్కడ గెలిస్తే అక్కడే ఉంటానని మాత్రం చెప్పడం లేదు. గజ్వేల్ లోనే ఉంటానని చెప్పారు. కామారెడ్డిలో గెలిచినా సరే రాజీనామా చేస్తారని పరోక్షంగా చెప్పినట్లయింది. కేసీఆర్ రెండు చోట్ల పోటీ ప్రకటన తర్వాత.. గజ్వేల్లో ఆయన పరిస్థితి గడ్డుగా ఉందని అందుకే కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీచేస్తానని బీజేపీ నేత ఈటల ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అందుకే కేసీఆర్ తాను గజ్వేల్ లోనే ఉంటానని వారికి భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తున్నది.
మరి సీఎం కేసీఆర్ గజ్వేల్ నాయకులతో ఇచ్చిన భరోసా కామారెడ్డి ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డిలో గెలిచినా రాజీనామా చేయడానికి ఓట్లు వేయడం ఎందుకు అన్న ఫీలింగ్ వస్తే మొదటికే మోసం వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే సీఎం కేసీఆర్ కామారెడ్డి క్యాడర్ తోనూ త్వరలో సమావేశం అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఆయన అక్కడి నేతలకు ఏం చెబుతారనేది కీలకంగా మారింది.