Lagishetti Tough Competition KTR : సిరిసిల్లను కల్వకుంట్ల తారక రామారావు అడ్డగా మార్చుకున్నారు. 2009 నుంచి ఆ నియోజకవర్గం నుంచి ఆయన గెలుస్తూ వస్తున్నారు. ఓటమి ఎరుగని నేతగా భారీ మెజారిటీతో గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికి నాలుగు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన కేటీఆర్ ఐదో సారి కూడా గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు. అయితే ఈ సారి ఆయనకు గెలుపు కత్తిమీద సాముగా కనిపిస్తుంది.
సిరిసిల్లను అభివృద్ధి చేయడంలో కేటీఆర్ పంథానే వేరు. ఆయన రాక ముందు తీవ్ర సమస్యలతో ఉన్న సిరిసిల్ల పట్టణంతో పాటు నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందింది. సీఎం తండ్రి కావడంతో కావాల్సినన్ని నిధులు తెస్తూ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికి నియోజకవర్గంలో ఆయనపై నిలబడి గెలిచిన నాయకుడే లేకపోవడం.. బీఆర్ఎస్ కేడర్ కూడా చురుకుగా ఉండడంతో ఆయన గెలుస్తూ వస్తున్నారు.
అయితే ఈ సారి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పట్టు కోల్పోవడం, అనూహ్యంగా కాంగ్రెస్ తెరపైకి రావడంతో ఆయన గెలుపుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాదాపు ఆయన 14 సంవత్సరాల నుంచి నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉన్నాడు. గత ఎన్నికల్లో దాదాపు 80 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందిన కేటీఆర్ ఈ సారి అంత మెజారిటీ దక్కించుకోలేకపోవచ్చన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఓట్లే చాలా కీలకం. వారిని ప్రసన్నం చేసుకుంటే చాలా వరకు విజయం సాధించినట్లే అయితే సారి ఈ ఓట్లను దక్కించుకునేందుకు పద్మశాలి వర్గానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్ బరిలో నిలుస్తున్నారు. ఇది కేటీఆర్ కు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లగిశెట్టి పద్మశాలి కాబట్టి ఎక్కువ పద్మశాలి ఓట్లను చీలుస్తాడని టాక్ వినిపిస్తుంది.