Modi Govt : వైద్య విద్యలో పెనుమార్పులకు మోదీ సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. గతంలో ఉన్న పలు నిబంధనలకు మార్పులు చేసింది. గతంలో మెడికల్ కాలేజీకి అనుమతులు రావాలంటే తప్పనిసరిగా 24 విభాగాలు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన నుంచి నాలుగింటిని తొలగించింది. ఇందులో కీలకమనైన పల్మనరీ మెడిసిన్ విభాగాన్ని కూడా కేంద్రం, జాతీయ మెడికల్ కమిషన్ తొలగించింది. అయితే దీంతో పాటు ఎమెర్జెన్సీ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్, రిహాబిలిటేషన్, రేడియేషన్ అంకాలజీ విభాగాలను కూడా తొలగించింది.
అయితే ఇందులో భాగంగా కొత్తగా సమీకృత వైద్య పరిశోధనా విభాగాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అత్యవసర వైద్యానికి ప్రాధాన్యమిచ్చినట్లు కనిపిస్తున్నది. సాధారణ పడకలను 8 శాతం వరకు తగ్గించి, ఐసీయూ పడకలను 120 శాతం పెంచింది. దీంతో పాటు అనెస్తీషియా కింద పెయిన్ మేనేజ్ మెంట్ విభాగాన్ని తీసుకొచ్చారు. తద్వారా మోకాళ్ల నొప్పులు, దీర్ఘకాలిక నొప్పులు, నడుము నొప్పులు దీని కిందకు వస్తాయి. దీంతో పాటు యోగాను కూడా ఒక విభాగంగా ప్రవేశ పెట్టారు. ఈమేరకు వేర్వేరుగా ఆడ, మగకు శిక్షకులు ఉండాలని నిర్ణయించింది. దీంతో పాటు గతంలో మెడికల్ కాలేజీ 300 పడకలు ఉండాలనే నిబంధనను మార్చి 220కి తీసుకువచ్చింది.
దీంతో పాటు కాలేజీకి సొంత భవనం ఉండాలనే నిబంధనను పక్కన పెట్టి 30 ఏండ్ల లీజుతో భవనం ఉన్నా సరిపోతుందనే నిబంధనను తీసుకొచ్చింది. దీంతో పాటు మెడికల్ కాలేజీకి, అనుబంధ వైద్యశాలకు కేవలం 30 నిమిషాల్లో చేరుకోవాలనే నిబంధన వర్తింపు చేసింది.దీంతో పాటు మెడికల్ కాలేజీకి అనుబంధంగా వైద్యులు, సిబ్బంది 17 మందితో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలి. ఎంబీబీఎస్ విద్యార్థులను శిక్షణలో భాగంగా ఇక్కడికి పంపాల్సి ఉంటుంది. గతంలో ఎంబీబీఎస్ హౌసర్జన్లు, రెసిడెంట్లకు హాస్టల్ వసతి తప్పనిసరిగా ఉండేది. తాజాగా రెసిడెంట్లకు దానిని తీసేశారు.
అయితే ఇటీవల నరేంద్రమోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతినిచ్చింది. దీంతో ప్రైవేట్ కళాశాలల్లో కోట్లు పోసి చదువుకోలేని వారికి మేలు జరిగింది. ఎంబీబీఎస్ సీట్లు కూడా ఆయా రాష్ర్టాల్లో పెరిగాయి. రానున్న రోజుల్లో మెరుగైన వైద్యం కూడా సామాన్య ప్రజానీకానికి మరింతగా అందుబాటులోకి రాబోతున్నది. ఇప్పుడు కూడా ప్రభుత్వం సవరించిన నిబంధనలపై హర్షం వ్యక్తమవుతున్నది ఒక్క పల్మనరీ మెడిసిన్ రద్దు చేయడంపై మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.